‘అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా!’ అన్నది పాత సామెత. ‘మూడో ముప్పు వచ్చేలోగా మూడు ముళ్లు పడాలి’ అన్నది ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న మాట. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్నదన్న వార్తలు పెండ్లీడు పిల్లలకు ఆకస్మిక వివాహ యోగానికి కారణమవుతున్నాయి. ఇంతకుముందు సంబంధం కుదిరిన తర్వాత కూడా కనీసం నెల, రెండు నెలలు విరామంతో ముహూర్తం నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వ్యవధి ఇవ్వడం లేదు పెద్దలు. ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగకముందే.. తమ ఇంట పెండ్లి బాజాలు వినిపించాలని భావిస్తున్నారు.
‘వారంలో అయిపోవాలి..’ పేరయ్య తొందర.
మీనమేషాలు లెక్కించకుండా ‘ఊఁ అనేయండి’ ఓ పెండ్లిపెద్ద ప్రోత్సాహం.
‘పెట్టుపోతలు తర్వాత చూసుకోవచ్చులే. ముందు మీరు సరే అనండి’ ఇది అందరి మాట.
ఈ మధ్య పెండ్లి చూపుల్లో వినిపిస్తున్న మాటలివి. సంబంధం నచ్చిందా.. ‘అయం ముహూర్త సుముహూర్తోస్తు..’ అనేస్తున్నారు.
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, వియ్యాలవారు కయ్యాల జోలికి వెళ్లకుండా.. వీలైనంత త్వరగా పెండ్లితంతు ముగించాలని భావిస్తున్నారు. మరో వారం రోజులు మాత్రమే ముహూర్తాలు ఉండటంతో.. ఆగమేఘాల మీద పెండ్లిసందడికి సై అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న మార్గశిర మాసం వివాహాలకు అనుకూలం. ఇది దాటితే శూన్యమాసంగా పరిగణించే పుష్యంలో వివాహాది శుభకార్యాలు చేయరు. ఆ తర్వాత వచ్చే మాఘంలోనూ మౌఢ్యమి కారణంగా ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. వీటన్నింటికీ మించి ఒమిక్రాన్ గ్రహణం పట్టకముందే ఇంట్లో శుభకార్యం చేయాలని చాలామంది భావిస్తున్నారు. ఈ నెల 29 వరకే శుభ ముహూర్తాలు ఉండటంతో.. ఈ లోపుగానే పెండ్లి అయిపోవాలని యోచిస్తున్నారు. కల్యాణ మండపం అందుబాటులో లేకపోతే, గుడిలోనో, బడిలోనో తంతు కానిచ్చేస్తున్నారు. పెట్టుపోతల విషయాల్లోనూ పట్టింపులకు పోకుండా.. కరోనా నిబంధనలు రాకముందే కల్యాణం జరిగిపోవాలని నిశ్చయించుకుంటున్నారు.
గత కరోనా అనుభవాలు తల్లిదండ్రులను తొందరపెడుతున్నాయి. బిడ్డల పెండ్లిని ఘనంగా చేయాలన్న తపనతో వివాహ భోజనంబుకు రోజుల వ్యవధిలోనే మెరుపు వేగంతో ఏర్పాట్లు చేసేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి పరస్పరం ఇష్టపడితే పెండ్లి చూపుల్లోనే నోరు తీపి చేసుకొని నిశ్చితార్థం కానిచ్చేస్తున్నారు. గంటల్లో డిజిటల్ ఇన్విటేషన్ సిద్ధం చేసి నిమిషాల్లో అయినవారికి పంపుతున్నారు. ఒక్క రోజులోనే పెండ్లి షాపింగ్ అయిందనిపిస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి కఠిన నిబంధనలు అమల్లోకి రావొచ్చన్న అనుమానంతో ఉన్నఫళంగా పప్పన్నం పెట్టేయాలని ఫిక్సవుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది చివరి వారం.. పెండ్లివారంగా ముగియనున్నది.