Minister Komatireddy | నీలగిరి, మార్చి 13 : నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటపొలాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలను కాపాడటం తమ వల్ల కాదని ఆ దేవుడే కాపాడాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను, పంటపొలాలను కాపాడటం మా వల్ల కాదు.. ఆ దేవుడే వర్షం రూపంలో రావాలి. లేకుంటే పొట్టకు వచ్చిన వరి చేలు, కాత మీదున్న తోటలను ఎండబెట్టుకోవాల్సిందే. మేము ఏమీ చేయలేం’ అని బాహాటంగా తమ అసమర్థతను బయటపెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 25 ఏండ్లలో ఎప్పుడూ రాని కరువు ఈ సంవత్సరం వచ్చిందని, చాలా ప్రాంతాల్లో వరి పొలాలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయని, తాగడానికి కూడా నీరు లేదని తెలిపారు. నల్లగొండ జిల్లాకు నిత్యం 18 ఎంఎల్డీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 26 ఎంఎల్డీలు అందజేస్తున్నా సరిపోవడం లేదని చెప్పారు. ప్రజలు నీటిని వృథా చేయవద్దని సూచించారు. కృష్ణా నదిలోనే నీరు లేదని, కర్ణాటక నుంచి తాగునీటిని తీసుకొచ్చేందుకు త్వరలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలువనున్నామని ఆయన తెలిపారు. మూడు నెలలపాటు ప్రజలు, అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల కోసం అవరసరమైతే ట్యాంకర్లను వాడాలని, నిధుల విషయంలో ఇబ్బంది పడవద్దని అధికారులకు సూచించారు.