Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): గాలిగాలి అని గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. పోలింగ్కు ముందే చేతులెత్తేశారు. స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర అగ్రనేతలు, చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నికల సభ అంటేనే జంకుతున్నారు. కాళ్లు, గడ్డాలు పట్టుకొని బతిమాలినా జనం రాకపోవటంతో అర్థంపర్థంలేని కారణాలు చెప్తూ సభలను రద్దుచేసుకొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముందుగా నిర్ణయించిన సభలను కూడా రద్దుచేసుకొంటున్నారు. ఆయన 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉండి కూడా ఇలాగే పోలింగ్కు ముందు సభలను రద్దుచేసుకొని పారిపోయారు. కొడంగల్లో అప్పటికే ఓటమి ఖరారు కావటంతో పలాయనం చిత్తగించారు. ఇప్పుడూ అలాగే చేస్తుండటంతో ఈసారి కూడా పోలింగ్కు ముందే రేవంత్ ఓటమి ఖాయమైందని తేలిపోయింది.
రెండు రోజుల్లోనే మూడు సభలకు ఆయన మొఖం చాటేశారు. పీసీసీ అధ్యక్ష హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నా.. సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఆయన్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నారు. శుక్రవారం కామారెడ్డిలో ప్రచారాన్ని రద్దు చేసుకోగా శనివారం షాద్నగర్, ఇబ్రహీంపట్నం సభలను రద్దు చేసుకున్నారు. ఇకపై పూర్తిగా కొడంగల్పైనే దృష్టి పెట్టేందుకు సభలను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. అయితే పార్టీ నేతలు మాత్రం హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం వల్లే సభలు రద్దయ్యాయని కాకమ్మ కథలు చెప్తున్నారు. అసలు కారణం మాత్రం కొడంగల్లో ఓటమి భయమే.
కాంగ్రెస్ ‘సీఎం’లకు ఓటమి భయం
మొన్నటివరకు తామే సీఎం అభ్యర్థులమని గల్లాలు ఎగరేసిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు సొంత నియోజకవర్గాల నుంచి కదలటం లేదు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నాకొద్ది వాళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, సీతక్క, మధుయాష్కీగౌడ్ వంటి కీలక నేతలు అన్ని సభలను రద్దుచేసుకొని సొంత సెగ్మెంట్లలో సెటిలైపోయారు. సభలకు వెళ్లినా జనం లేక ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు వినిపించాల్సి వస్తున్నది. మరోవైపు సొంత నియోజకవర్గాల్లో ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో మిగిలిన ఈ రెండురోజుల్లోనైనా కష్టపడి డిపాజిట్లు దక్కించుకొని పరువు కాపాడుకొనే పనిలో పడ్డారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారంపై ప్రశ్నిస్తే.. పార్టీ గెలుపు సంగతి దేవుడెరుగు ముందు తాను గెలవాలికదా అని ప్రశ్నిస్తున్నారు.