హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన పేదలంతా ఆసరా వృద్ధాప్య పింఛన్ల్లకు దరఖాస్తు చేసుకొనేందుకు మరో అవకాశం కల్పించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 30వ తేదీవరకు దరఖాస్తు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ల్ల అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించినా అర్హులు చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం సూచన మేరకు సీఎస్ శనివారం సమీక్ష నిర్వహించి చాలామంది అర్హులు మిగిలి ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇచ్చి పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్రావును ఆదేశించారు.
అటెండెంట్స్కు వసతులు కల్పించండి.
హైదరాబాద్లోని దవాఖానలకు రోగుల వెంట వచ్చే అటెండెంట్స్కు అవసరమైన వసతులు కల్పించాలని సీఎస్ ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లో ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆయన సూచన మేరకు శనివారం బీఆర్కే భవన్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, దవాఖానల సూపరింటెండెంట్లతో సీఎస్ సమీక్షించారు. నిమ్స్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి, ఫీవర్, ఎంజే క్యాన్సర్ దవాఖానలు, ప్రభుత్వ ప్రసూతి దవాఖానలకు రోగులకు సహాయకులుగా వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించేందుకు ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో అటెండెంట్స్కు టిఫిన్, భోజన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. షెల్టర్లు, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించాలని సూచించారు. దసరా పండుగ నుంచే ఈ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.