గజ్వేల్, నవంబర్ 30: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ సర్కార్ అండగా ఉంటుందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ప్రతి నెలా 5.51 లక్షల మంది దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పింఛన్ అందిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ప్రతి జిల్లాకు రూ.50 వేల చొప్పున నిధులు కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు.
బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 40 మంది దివ్యాంగులకు హైటెక్నాలజీతో తయారైన కృత్రిమ కాళ్లు, చేతులు అందించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ఉపకరణాలు అందించేందుకు కొలతలు తీసుకున్నారు.
అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమై క్య రాష్ట్రంలో ఆగస్టు 15 వంటి ప్రత్యేక సందర్భాల్లోనే దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, ట్రై సైకిళ్లు అందజేసేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు లక్ష మందికి సహాయ ఉపకరణాలను, ట్రైసైకిళ్లు, త్రీవీలర్ వాహనాలను పంపిణీ చేశామన్నారు. 35 వేల మంది మూగ, చెవిటి వారికి 35 వేల సిమ్లు, స్మార్ట్ఫోన్లు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం 20 హాస్టళ్లు ఉండగా వీటిలో 6 అంధుల కోసమే నిర్వహిస్తున్నట్టు చెప్పారు.