హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోని మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం సమస్య పరిష్కారానికి క్లీన్ఎయిర్ అథారిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తంచేశారు. క్లీన్ఎయిర్ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఇంతవరకూ విధానపరమైన నిర్ణయం వెల్లడించలేదని ఆక్షేపించారు. అథారిటీలకు నిర్దిష్టంగా నిధులు కేటాయించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేసి సంయుక్తంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా ముంబై నగర వాయు కాలుష్య సమస్యపై చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. దేశంలోని అన్నీ మెట్రో నగరాల్లో ఇదే రకమైన సవాల్ ఉన్నదని పేర్కొన్నారు.