హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తులు కేసుల పరిష్కారం కంటే.. తీర్పుల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఏపీ రాజధాని అమరావతి సమీపంలో నిర్మించిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీతోపాటు హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టు, ఆన్లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సంబంధించి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను సీజేఐ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం వివాదాల పరిష్కారమే కాకుండా న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సూచించారు. గతంతో పోల్చితే న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగం అనూహ్యంగా పెరిగిందని, దీన్ని అందిపుచ్చుకొనేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కేసుల పరిష్కారంలో జాప్యం నివారించాలని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి.. బాధితులకు ఉపశమనం కలిగించాలని పేర్కొన్నారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్న సీజేఐ.. న్యాయవ్యవస్థ పరిరక్షణకు అందరి సహకారం అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, న్యాయమూర్తులు పాల్గొన్నారు.