హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రహదారులపై వెళ్లేటప్పుడు పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటించాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. అజాగ్రత్త వల్ల చాలా మంది పాదచారులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల వల్ల 283 మంది మరణించారని, వారిలో 71 మంది పాదచారులు ఉన్నారని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్ఆర్టీసీ పలు చర్యలు చేపడుతున్నదని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా ఇటీవల 4 వేల అద్దె బస్సుల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి డిపోలో సేఫ్టీ వార్డెన్లను నియమించినట్టు వివరించారు.