హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో ఈ నెల 30న తెలంగాణభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దళితుల భూములను అక్రమంగా కాజేసిన ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా బీజేపీ అధిష్ఠానం పెడచెవిన పెట్టడంతో పెద్దిరెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.