చేర్యాల, ఫిబ్రవరి 19 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఆలయ అధికారులు ఒగ్గు పూజారులతో పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీమల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగిరులు తదితర ప్రాంతాల్లో ఊరేగించారు. ఒగ్గు పూజారులు పంచరంగులతో పట్నం వేశారు.
అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పెద్దపట్నం దాటించారు. ఆ వెంటనే భక్తులు సైతం పట్నం దాటి స్వామి వారిని దర్శించుకొన్నారు. కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ ఆదివారాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకొన్నారు.