సంస్థ నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మెల్యే కోరుకంటి ఆగ్రహం
కుందనపల్లి నుంచి పెద్దపల్లి వరకు మహాపాదయాత్ర
అంతర్గాం ఫిబ్రవరి 21: ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. సోమవారం కుందనపల్లి నుంచి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు 20 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే మహాపాదయాత్ర చేపట్టారు. రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామమైన కుందనపల్లిలో బూడిద చెరువు ప్రభావంతో గ్రామస్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో పాలకులు, ఎన్టీపీసీ యాజమాన్యానికి మొర పెట్టుకొంటే మరోచోటుకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రంగా మారడంతో గ్రామంలోని మహిళలు 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే సోమవారం మహా పాదయాత్ర చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం మొండివైఖరి వీడి కుందనపల్లి గ్రామస్థులకు సకల వసతులతో పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పాదయాత్రలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, రామగుండం మేయర్ అనిల్కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఎన్టీపీసీ సీఅండ్ఎండీకి ఎంపీ వెంకటేశ్ వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఎన్టీపీసీ బూడిద సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ఎన్టీపీసీ సీఎండీని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీలో ఎన్టీపీసీ సీఅండ్ఎండీ గురుదీప్సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి ఎన్టీపీసీ సీఅండ్ఎండీ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.