సూర్యాపేట, నమస్తే తెలంగాణ : సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు, యాటపోతులతో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. లింగా… ఓ లింగా అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. దాదాపు 12 లక్షల మంది వచ్చినట్టు అధికారుల అంచనా. మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తదితరులు స్వామివారిని దర్శించుకొన్నారు.