హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ మద్యం విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాలులో బుధవారం తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణలో గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేధింపులు లేవని, రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని పూర్తిగా నియంత్రించామని మంత్రి వివరించారు. అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు బార్లలో ఫుల్ బాటిళ్లతోపాటు క్వార్టర్, హాఫ్ బాటిళ్లు కూడా అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చామని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న మద్యాన్ని నివారించడం వల్లే రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు రాష్ట్ర ప్రభుత్వం బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే గోదాముల్లోనే మద్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ను అసోసియేషన్ ప్రతినిధులు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ దామోదర్గౌడ్, ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి, గౌరవ సలహాదారులు బాలగోని బాలరాజ్గౌడ్, చక్రపాణి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, పీ రాజుగౌడ్, మాజీ అధ్యక్షుడు మనోహర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, కూరెళ్ల వేములయ్యగౌడ్, అనిల్ కుమార్గౌడ్, పవన్కుమార్గౌడ్తోపాటు రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.