హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్స్టేషన్ పరిధి కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువకుడు, ఆటోడ్రైవర్ ధనావత్ సాయి సిద్ధుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి తక్షణం రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 9న అర్ధరాత్రి సాయి ఇంటిలోకి అక్రమంగా చొరబడిన పోలీసులు అతన్ని బయటకు తీసుకెళ్లి, కుల దూషణలు చేస్తూ థర్డ్ డిగ్రీ హింసకు గురిచేశారు. ఎలాంటి గాయాలు లేవని మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో కోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించారు. తర్వాత నల్లగొండ దవాఖానలో నిర్వహించిన రెండోసారి వైద్య పరీక్షల్లో తీవ్రగాయాలు ఉన్నట్టు తేలడంతో బాధితుడి తరఫున న్యాయవాది కారుపోతుల రేవంత్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు నోటీసులకు స్పందించకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధితుడికి రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.