హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిజంపై అవగాహన లేని అజ్ఞాని పవన్ అని విమర్శించారు.
సమాజంలో దోపి డీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటల్ని కొనలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని జాన్వెస్లీ మండిపడ్డారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.