సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) కాంగ్రెస్లో (Congress) ఐదో జాబితా చిచ్చుపెట్టింది. పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న రమేశ్ రెడ్డిని (Patel Ramesh Reddy) కాదని దామర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసమ్మతి జ్వాల ఎగసిపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రమేశ్ రెడ్డి అనుచరులు పట్టణంలోని రోడ్లపై నిరసన వ్యక్తంచేశారు. ధర్నాకు దిగారు. కాగా, టికెట్ ప్రకటనలో తనకు చాలా అన్యాయం జరిగిందని పటేల్ రమేశ్ రెడ్డి వాపోయారు. అధిష్టానం నిర్ణయం తనకు అశనిపాతంలా మారిందన్నారు. కావాలనే కొంతమంది స్థానిక మంత్రిని గెలిపించాలనే లక్ష్యంతో తనకు టికెట్ రాకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేశానని, ఇంట్లో కూర్చున్నా గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ టికెట్ రాలేదని విమర్శించారు.
తాను రాజకీయంగా బలపడటం ఇష్టంలేక, మంత్రిని గెలిపించేలా కొందరి కుట్ర కనిపిస్తున్నదని ఆరోపించారు. అన్ని సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 2018 జరిగిన అన్యాయమే మళ్లీ జరిగిందని వాపోయారు. నిర్బంధంలో కూడా కష్టపడి పనిచేస్తే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని, స్వతంత్ర అభ్యర్థిగా భరిలో ఉండాలని తనపై ఒత్తిడి వస్తున్నది చెప్పారు. నేడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నానని స్పష్టం చేశారు. తనకు టికెట్ దక్కకుండా జరిగిన కుట్ర వెనక ఎవరి హస్తం ఉందో త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.