హైదరాబాద్ : తత్కాల్, నార్మల్ కేటగిరిల వారీగా పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడానికి డిసెంబర్ 3 (శనివారం)న రాష్ట్రంలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్, బేగంపేట్, టోలిచౌకీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని పాస్పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సేవలు వినియోగించుకోవాలని కోరారు. తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎటువంటి వాక్ ఇన్ అభ్యర్థనలు స్వీకరించబోమని అన్నారు. దరఖాస్తుదారులందరూ తమ పాస్ పోర్ట్, పాస్ పోర్ట్ సంబంధిత అవసరాల కోసం మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించొద్దని సూచించారు.