కరీంనగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష దాటింది. నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటిరోజు సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్.. సభ్యత్వ నమోదు చేయాల్సిన తీరు తెన్నులపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి, గడపగడపకూ తిరిగి సభ్యత్వం చేయించాలని సూచించారు. నిజానికి పార్టీ అధిష్ఠానం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలను లక్ష్యంగా విధించింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్న నేపథ్యంలో.. సిరిసిల్లలో లక్ష సభ్యత్వం చేయాలని పార్టీ నాయకులు అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ మేరకు గ్రామం నుంచి పట్టణం వరకు.. ఎక్కడికక్కడే సమూహాలుగా ఏర్పడి పకడ్బందీగా ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తద్వారా అందుతున్న ఫలాలు, సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు.. సభ్యత్వం గురించి చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా.. స్వచ్ఛందంగా డబ్బులు చెల్లించి సభ్యత్వ రసీదులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ సారి యువకులు ఎక్కువగా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొచ్చారు. గతంలో జరిగిన సభ్యత్వ నమోదులో సిరిసిల్ల నియోజక వర్గంలో 60 వేలు చేశారు. ఈసారి లక్ష దాటించి తన రికార్డును తానే తిరగరాసింది. ఈ నెల 4వరకు మొత్తంగా నియోజక వర్గంలో 1,03,075 సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రికార్డు స్థాయిలో జరిగిన సభ్యత్వంపై టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తంచేయగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ గురువారం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకు కొనసాగి నియోజకవర్గ అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.