హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ‘ఎలాగైనా సరే తెలంగాణ రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టాలి. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి నష్టం చేయాలి’..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర. తన లక్ష్యాన్ని నెరవేర్చుకొనేందుకు కేంద్ర సర్కారు.. రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నది. హలం పట్టి ఆరుగాలం కష్టించి పండించిన పంటను తీసుకొనేందుకు నానాకొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి సీఎమ్మార్(బియ్యం) సేకరణకు ససేమిరా అంటున్నది.
అందులో భాగంగానే రాష్ట్రం నుంచి సీఎమ్మార్(బియ్యం) సేకరణను కేంద్రం ఆధీనంలోని ఎఫ్సీఐ 23 రోజులుగా నిలిపేసింది. ఎక్కడో ఒక చోట మిల్లులో తనిఖీల్లో సేకరించిన ధాన్యంలో తేడాలు రావటాన్ని సాకుగా చూపుతూ బియ్యం సేకరణ నిలిపివేసింది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఎఫ్సీఐ బియ్యం తీసుకొని డబ్బులు చెల్లిస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ.1,960 చొప్పున కొనుగోలు చేస్తున్నది. గత మూడు సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీని విలువ రూ.22 వేల కోట్లు. గత వానకాలంలో రూ. 13,740 కోట్ల విలువైన 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రానికి 35 లక్షల టన్నుల ధాన్యానికి సమానమైన బియ్యాన్ని అందించింది.
అంటే ఇంకా రాష్ట్రం వద్ద 35 లక్షల టన్నుల ధాన్యం ఉంది. ఈ యాసంగిలో రూ. 9,834 కోట్ల విలువైన 50.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. బియ్యం సేకరణ ఇంకా మొదలుకాలేదు. దీనికి తోడు అంతకు ముందు ఏడాది యాసంగికి సంబంధించిన సుమారు 5.70 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రం వద్దే ఉన్నది. మొత్తం 92 లక్షల టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చాక ఎఫ్సీఐ సేకరిస్తేనే రాష్ర్టానికి డబ్బులు వస్తాయి. లేకుంటే 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అయిన ఖర్చు రూ.22 వేల కోట్ల భారం రాష్ట్రంపైనే పడుతుంది. రాష్ర్టాన్ని ఇబ్బందిపెట్టడమంటే పరోక్షంగా రైతులను ఇబ్బంది పెట్టడమేనని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. వరి పంట సాగుచేయాలంటే జంకే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి పెట్టి ధాన్యం కొనుగోలు చేసినా, ఒప్పందం ప్రకారం సీఎమ్మార్ తీసుకోకుండా ఎఫ్సీఐని అడ్డుపెట్టుకొని కేంద్రం కక్ష సాధిస్తున్నదని ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంపై, రైతులపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. గత రెండేండ్లుగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నది. గత రెండేండ్లుగా యాసంగిలో బాయిల్డ్ రైస్ వద్దని, రా రైస్ మాత్రమే కావాలని మొండిపట్టు పట్టింది. యాసంగిలో రా రైస్ ఇస్తే వచ్చే నూకతో కలిగే నష్టాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ధాన్యం సేకరించింది. అయినప్పటికీ సీఎమ్మార్ తీసుకోకుండా కేంద్రం ఇబ్బందిపెడుతున్నది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇలా అగ్రనేతలంతా శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ర్టానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చాకే అడుగుపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో బియ్యం సేకరణను ఎఫ్సీఐ కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జూన్ 7 నుంచి బియ్యం సేకరణ నిలిపివేయడంతో మిల్లర్ల వద్ద భారీగా నిల్వలు పేరుకుపోయాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మిల్లర్లు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణమే ఎఫ్సీఐ బియ్యం కొనుగోళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బియ్యం సేకరణను నిలిపేయడం ద్వారా తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసి నష్టపరచాలని కేంద్రం చూస్తున్నది. కేంద్ర ఆడుతున్న రాజకీయ ఆటలో రైతులు బలవుతున్నారు. రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రం పరోక్షంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేంద్రం నిలిపేసింది రైతాంగం డబ్బులే. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తీసుకోబోమని చెప్పడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కేంద్రం కక్షపూరిత రాజకీయాలను వీడి బియ్యం సేకరణకు అనుమతివ్వాలి. తద్వారా రాష్ట్ర రైతాంగానికి భవిష్యత్పై భరోసా కల్పించాలి.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి
యాసంగి ధాన్యంలో నూకశాతం లెక్కించేందుకు రాష్ట్రంలోని మిల్లుల నుంచి 45 బస్తాల ధాన్యం బస్తాలను శాంపిల్స్గా సీఎఫ్టీఆర్ఐ శాస్త్రవేత్తలు సేకరించారు. గత నెలలో రాష్ట్రంలో రెండు రకాల ధాన్యంను మిల్లింగ్ చేసి పరీక్షలు నిర్వహించారు. తర్వాత మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్(సీఎఫ్టీఆర్ఐ)లో పరీక్షించేందుకు రెండు రకాల ధాన్యాన్ని 45 బస్తాల శాంపిల్స్ను తీసుకెళ్లనున్నారు.