EVM | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో దాదాపు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అనేకసార్లు పరీక్షించిన తరువాతే వాటిని ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ, పోలింగ్కు ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో వాటిని పరీక్షించి చూపిస్తున్నా ఈ సందేహాలు ముగియడంలేదు. మన దేశంలో అనేక దశాబ్దాలపాటు బ్యాలెట్ పేపర్ల విధానమే అమలులో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఎన్నికల కమిషన్కు చెందిన సాంకేతిక నిపుణుల కమిటీ (టీఈసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెంగుళూరు), ఈసీఐఎల్, హైదరాబాద్ వీటిని తయారుచేస్తున్నాయి. ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు ఎన్నికల కమిషన్ ఎంతో కసరత్తు చేసింది. ఆయా పార్టీల నేతలు, సాంకేతిక నిపుణుల సమక్షంలో అనేకసార్లు వీటి పనితీరును పరీక్షించింది. సెల్ఫోన్, బ్లూటూత్సహా ఇతర ఎటువంటి పరికరంతోనూ వీటిని ఆపరేట్ చేసే అవకాశం లేదని తేల్చింది. అంతా సంతృప్తి చెందిన తరువాతే వీటిని ప్రవేశపెట్టారు.
ఈవీఎంల పనితీరు ఇలా
ఈవీఎంలో మూడు యూనిట్లుంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తాయి కాబట్టి వీటికి విద్యుత్తుతో పనిలేదు. ఒక్కో ఈవీఎంలో 2000 వరకు ఓట్లను రికార్డుచేసే వీలుంటుంది. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో నోటాసహా 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఒక్కో ఈవీఎం 15 ఏండ్లపాటు పనిచేస్తుంది. ఒక్క నిమిషానికి నాలుగు ఓట్లను మాత్రమే వేయవచ్చు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఎంతమాత్రం ఉండదు.
వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీం…
ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను పలుమార్లు న్యాయస్థానాలు కొట్టివేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈవీఎంల సోర్స్ కోడ్ (సాఫ్ట్వేర్, దాని పనితీరుకు సంబంధించిన వివరాలు)పై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన కేసును గత మార్చిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్సహా పలు విపక్షపార్టీలు వీవీప్యాట్లో వచ్చే స్లిప్లను అన్నింటినీ లెక్కించాలని కోరుతున్నాయి. దీంతో ఓటింగ్ మెషీన్లో ఏమైనా పొరపాట్లు జరిగితే తెలుస్తుందని వారు పేర్కొంటున్నారు.
ఈవీఎంల ఉపయోగం, నిషేధం ఉన్న దేశాలు
యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాలు ఈవీఎంలకు దూరంగా ఉన్నాయి. ఈవీఎంలపై అధ్యయనం చేసిన, ఉపయోగించిన దేశాలు 31 ఉన్నాయి. ఇందులో నాలుగు దేశాలు జాతీయ ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తుండగా, 11 దేశాలు చిన్నచిన్న ఎన్నికలకు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని ఈవీఎంలను నిషేధించడం గమనార్హం. ఈవీఎంలను నిషేధించిన దేశాలన్నీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు కావడంతో మన దేశంలో కూడా కొన్ని పార్టీలు ఇదేవిధమైన డిమాండ్ చేస్తున్నాయి.