హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ జాబ్ల పేరుతో యువతకు వలవే సి ప్రీపెయిడ్ టాస్క్ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల మూలాలు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా రోజూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్లు మన దేశానికి సంబంధించిన సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తూ ఆ మోస పు సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలించుకుపోతున్నారు. ఈ ముఠాల్లో చైనీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో వాట్సాప్కు మెసేజ్లు పంపి అమాయకులకు వల వేయడం ఈ ముఠాల పని. ఆ మెసేజ్లకు స్పందించినవారిని టెలిగ్రామ్ యాప్లోకి తీసికెళ్లి ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ను కేటాయిస్తారు.
అనంతరం ఓ వెబ్సైట్ లింక్ను పంపిస్తారు. ఆ లింకును ఓపెన్ చేసినవారితో చర్చించి ఊబిలోకి లాగేందుకు ఢిల్లీ, గుర్గావ్, రాజస్థాన్, భరత్పూర్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని టీమ్లు పనిచేస్తుంటాయి. విదేశాల నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఈ టీమ్లు తమ వలలో చిక్కినవారి నుంచి ముందుగానే ఫోన్నంబర్లు, బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు తీసుకుంటారు. అనంతరం తాము పంపిన లింక్లను క్లిక్ చేయించి ఒక్కో క్లిక్కు రూ.50 చొప్పున వారి ఖాతాల్లో రూ.150 నుంచి రూ.300 వరకు డిపాజిట్ చేస్తారు.
ఆ సొమ్ము, దానిపై వచ్చిన లాభాలు సదరు వెబ్సైట్ స్క్రీన్లో ఓ మూలన కనిపిస్తుంటాయి. దీంతో ఇదంతా నిజమేనని ఆ అమాయకులు నమ్మిన తర్వాత ప్రీపెయిడ్ టాస్క్లంటూ వల వేస్తారు. ప్రీపెయిడ్ కార్డులు కొనాలని ఆశపెట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించాక బిచాణా ఎత్తేస్తారు. తాము మోసపోయినట్టు బాధితులు గుర్తించిన తర్వాత ఆ వెబ్సైట్ లింక్ పనిచేయదు. ఇలా సైబర్ నేరగాళ్లు ఒక్కో అమాయకుడికి ఒక్కో వెబ్సైట్ లింక్ను పంపి మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.