Parliament | కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించామని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేయడంతో పాటు తెలంగాణకు సంబంధించి పెండింగ్ అంశాలపై గళం విప్పారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. కేంద్రం వద్ద ఎన్నో పెండింగ్ సమస్యలున్నాయని, వాటిపై ప్రతి లోక్సభ సమావేశాల్లోనూ ప్రస్తావించి, తెలంగాణ వాణిని బలంగా వినిపించామన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు తదితర అన్ని పెండింగ్ అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేశామని ఆయన తెలిపారు. ఈ చివరి సమావేశాల్లో కూడా పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని నామా నాగేశ్వర్రావు, కేశవరావు స్పష్టం చేశారు.