హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని యశోద గ్రూప్ హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. యేటా దాదాపు 1.4 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, వీరిలో 10 శాతం కంటే తక్కువ మంది రోగులు ఐదేండ్లు మాత్రమే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ వ్యాధులపై యశోద హాస్పిటల్లో నిర్వహించిన జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఇందులో దేశంలోని 500 మందికిపైగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, 20 మంది ప్రముఖ జాతీయ ప్యాంక్రియాస్ వైద్యనిపుణులు పాల్గొన్నారు. అధునాతన, రోబోటిక్ ప్యాంక్రియాటిక్ సర్జరీకి సంబంధించి పలు అంశాలను చర్చించారు. లైవ్ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ పొగాకు, ధూమ, మద్యపానం, ఊబకాయం వంటి జీవన శైలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు దారి తీస్తున్నదని వివరించారు.
ధూమపానంతో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరణాల రేటు పెరుగుతున్నదని, 50 ఏండ్లలోపు పురుషులు ఈ క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నట్టు తెలిపారు. ప్రాంక్రియాస్ మన జీర్ణవ్యవస్థలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటని చెప్పారు. ప్యాంక్రియాటిక్కు సంబంధించిన వ్యాధులు వైవిధ్య, సంక్లిష్టమైనవని చెప్పారు. ప్యాంక్రియాటిక్కు సంబంధించిన చాలా రకాల వ్యాధులు, క్యాన్సర్లకు ఎక్కువ శాతం శస్త్రచికిత్సనే శరణ్యమని చెప్పారు. అయితే ఇతర శస్త్రచికిత్సల కంటే ఈ ప్యాంక్రియాటిక్ శస్త్రచికిత్సలు చాలా క్లిష్టమైనవని, మంచి అనుభవం, నైపుణ్యమున్న సర్జన్లు మాత్రమే చేయగలుగుతారని తెలిపారు. సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్యాంక్రియాటిక్ రుగ్మతలు సంక్లిష్ట సిండ్రోమ్ అని, ఇది అనేక కారణాలతో వస్తుందని చెప్పారు. ఈ రుగ్మతలు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి దేశంలోని దక్షిణాది రాష్ర్టాల్లో ప్రతి లక్ష జనాభాలో 200 మంది అక్యూట్ ప్యాంక్రియాటిస్ బారిన పడుతున్నట్టు తెలిపారు.