హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 57 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు సోమవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో అమలు చేస్తున్న వివిధ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీ అధికారులు, ఉద్యోగుల కృషివల్ల విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రమోషన్ పొందిన అధికారులు, ఇతర అధికారులు అదే స్ఫూర్తితో మరింతగా పని చేసి క్షేత్రస్థాయిలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు.