కరీంనగర్ : పల్లె ప్రగతి ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు.
శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏపీవో, ఏపీఎం, ఎంపీడీవో, డీపీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీవో అధికారులతో పల్లె ప్రగతిపై నిర్వహించిన సమావేశంలో సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. అధికారులు ప్రతి రంగంలో బాగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. స్వచ్ఛభారత్లో దేశంలో కరీంనగర్ జిల్లా టాప్లో ఉన్నందుకు అభినందించారు. పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ అన్నారు. గ్రామాల్లో శుభ్రత, పచ్చదనం, 24/7 నీటి సరఫరా లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలనే ధ్యేయంతో గ్రామాల్లో డంపింగ్ యార్డ్, ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలను క్లీన్ అండ్ క్లీన్గా ఉంచి భవిష్యత్ తరాలు రోగాలను బారిన పడకుండా చూడాలన్నారు. ఇంట్లో,ఇంటి బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
గ్రామాల్లో మార్పు వచ్చే దిశగా పనిచేయాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే మార్పు కనబడాలి అన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి డంపింగ్ యార్డ్లకు తరలించి వర్మి కంపోస్టు తయారు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ సిబ్బంది ప్రతిరోజు గ్రామ పరిసరాలను పరిశీలించాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం అధికారులకు స్పష్టత ఉండాలన్నారు. గ్రామాల్లో మెరుగైన సేవలు అందించేందుకు 9300 పంచాయతీ సెక్రెటరీలను ప్రభుత్వం నియమించిందని, వారు బాగా పనిచేస్తున్నందునే ప్రభుత్వం వారి వేతనం రూ. 15000 నుండి రూ. 30 వేలకు పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి బుక్లెట్ను ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా దేశంలోనే మంచి స్థానంలో నిలిచిందని తెలిపారు. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు వివరాలను కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు.
ఈ సమావేశంలో జేసీ ఆర్డీ ప్రదీప్ శెట్టి, అదనపు కలెక్టర్ గరీమగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ టోప్పో, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డీఆర్డీవో శ్రీలత, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీఓలు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.