హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్లో కొత్త రగడకు తెరలేపింది. టికెట్ పంచాయితీ తారస్థాయికి చేరింది. టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు.. ఎవరికివారుగా అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇస్తే తమకే టికెట్ ఇవ్వాలని.. లేదంటే సహాయ నిరాకరణ తప్పదని స్పష్టంచేస్తున్నారు. దీనికితోడు చెలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్గా మారింది. కాంగ్రెస్కు మునుగోడులోని పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నలుగురు అభ్యర్థులను ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు బుధవారం గాంధీభవన్కు పిలిపించి మాట్లాడారు.
‘కాంగ్రెస్ ఓటమి ఖాయం’..
మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఆ పార్టీ నుంచి ఉపఎన్నిక టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి తేల్చిచెప్పారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డి ఖరారయ్యారనే ప్రచారంపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించి ఓ కార్యకర్తతో స్రవంతి మాట్లాడిన ఫోన్సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘అసలు కృష్ణారెడ్డి ఎవరు? ఆయనకు ఈ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? ముక్కుమొహం తెలియని వ్యక్తి పేరును ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏనాడూ నియోజకవర్గంలో కనిపించలేదు. ఇక్కడ ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి? ఒకవేళ కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆడియోలో ఉన్నాయి.
సర్వే అంటూనే.. అభ్యర్థి ఖరారు
మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి ఖరారులో కాంగ్రెస్ హుజురాబాద్ తీరునే అనుసరిస్తున్నది. సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ ఎవరూ ఊహించని విధంగా ప్రధాన ఆశావాహుల్ని పక్కనబెట్టి హుజూరాబాద్లో బల్మూరి వెంకట్ను బరిలోకి దింపారు. ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సర్వే, అభిప్రాయ సేకరణ ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఓవైపు , పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోవైపు పదేపదే చెబుతున్నారు. కానీ, ఇప్పటికే అంతర్గతంగా చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆశావహులు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందే అభ్యర్థిని ఖరారు చేశాక.. ఇంకా సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ తమను మభ్యపెట్టడం ఎందుకని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా కీలక నేతలందరూ సహాయ నిరాకరణకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి.