జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ వేనని, దేశంలో మొదటి పది గ్రామాలకు 10 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఆదర్శ గ్రామాలుగా నిలిచాయన్నారు.
ఇదంతా సీఎం కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్న పల్లె ప్రగతి సాధించిన ఫలితమని మంత్రి చెప్పారు.
ఇదే తరుణంలో పల్లె ప్రగతికి కొనసాగింపుగా ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ పల్లె ప్రగతిని సక్సెస్ చేయాలని మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకుసూచించారు.
అలాగే విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 7,280 కోట్లతో నిర్వహిస్తున్న మన ఊరు మన బడి ని కూడా విజయవంతం చేయాలన్నారు. స్థానికంగా మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీరు, ఇతర సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎప్పటికి అప్పుడు అందచేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు.