గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి పనులు జోరుగా సాగాయి. నిర్దేశించుకున్న మేర మొక్కల పంపిణీ చేపడుతుండగా, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
వనసంపదను పెంచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్రేపల్లి నుంచి కొత్త కలెక్టరేట్ వరకు 6 కిలోమీటర్ల మేర 4 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత 9 రోజులపాటు కార్యక్రమానికి కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మంజులను ఆమె అభినందించారు. – వికారాబాద్
సర్పంచ్ విరాళం రూ.10 లక్షలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.10 లక్షల విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావుకు సంబంధిత చెక్కును సర్పంచ్ అందజేశారు.
– పటాన్చెరు
గ్రామాల పురోగతి
పల్లె ప్రగతితోనే గ్రామాల పురోగతి సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలిలోని గండిరామన్న హరితవనంలో పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. – సారంగాపూర్