హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన రాజకీయ సమాధిని తానే కట్టుకొంటున్నాడని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కమీషన్ల కోసమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను ఇరకాటంలో పెట్టేందుకు మోదీ సర్కార్కు ఏమీ దొరకలేదని, అందుకే రాజగోపాల్రెడ్డి రూపంలో ఉపఎన్నికలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎన్ని వేషాలు వేసినా మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని పల్లా తేల్చిచెప్పారు. హైదరాబాద్లోని రైతుబంధు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి అహంకారంతో అనైతికంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను ఈడీ, సీబీఐ, ఐటీ లాంటివీ ఏమీ చేయలేవని గ్రహించిన మోదీ, అమిత్షా ఉప ఎన్నికలను సృష్టించి ఇరకాటంలో పెట్టాలని చూస్తే పౌరుషాల గడ్డ, పోరాటాల నల్లగొండ ఖిల్లా తగిన గుణపాఠం చెప్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని తన ఆస్తులను పెంచుకొనేందుకు ఎత్తుగడ వేసిన రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు గత 8 సంవత్సరాల నుంచి ప్రయత్నించాడని, ఆయన ఎత్తును టీఆర్ఎస్ ముందే పసిగట్టిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్లో తనకు చోటు లభించదని తెలిశాకే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజల గురించి ఆయన ఎన్నడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దుర్మార్గ విధానాల వల్ల అభివృద్ధి, తాగునీరు లేక ఫ్లోరోసిస్ సమస్యతో అరిగోస పడ్డ మునుగోడుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆ సమస్యలన్నీ దూరమయ్యాయని వివరించారు. రాజగోపాల్రెడ్డి డ్రామాపై మునుగోడు ప్రజలు ఆగ్రహంతో రగిలిఉన్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించాడని పల్లా నిలదీశారు.