జనగామ, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ అక్రమాలను బయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుగా చర్యగా తనపై భూదాన్ భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలు చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 188లో 29 ఎకరాల భూదాన్ భూమిని తాను ఆక్రమించానని మంత్రి పొంగులేటి ఆరోపించడం అవాస్తవమని అన్నారు.
తనకున్నది కేవలం ఎకరం 10 గుంటలు మాత్రమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడకముందే ఆ భూమికి అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. ఆ భూమి భూదాన్ పరిధిలోకి రాదని 2008లోనే భూదాన్ యజ్ఞ బోర్డు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని అన్నారు.