నిరుపేద రోగులకు ఆపన్న హస్తంగా నిలుస్తోన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెబ్సైట్కు సంబంధించి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో తరచూ సర్వర్డౌన్ సమస్య తలెత్తుతున్నట్లు స్వయంగా పలు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల సిబ్బందే చెబుతున్నారు. ఉదయం సమయంలో సర్వర్డౌన్ కావడంతో రోగుల రక్తనమూనాలకు బార్కోడ్ చేయడం ఇబ్బందికరంగా మారుతున్నదని, దీని వల్ల నమూనాలు తారుమారు అయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో పాటు పలు సందర్భాలలో వైద్యపరీక్షలు నిలిచిపోతున్నట్లు పలు ఆరోగ్యకేంద్రాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ వాపోతున్నారు. మరో పక్క వైద్య పరీక్షలు జరిపేందుకు అవసరమయ్యే రియేజెంట్స్ కొరత కారణంగా వైద్య పరీక్షల రిపోర్ట్స్ జారీలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు అటు రోగులు, ఇటు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
సాధారణంగా ఏదైన అనారోగ్యం సమస్య ఎదురైనప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే సమస్యను గుర్తించేందుకు వైద్యులు ముందుగా అవసరమైన వైద్యపరీక్షలు రాయడం తెలిసిందే. ఈ పరీక్షల నివేధిక ఆధారంగానే రోగులకు అవసరమైన చికిత్సను ప్రారంభిస్తారు. ప్రస్తుత రోజుల్లో వైద్యుల కన్సల్టేషన్, చికిత్స ఖర్చుల కంటే మూడు నాలుగు రెట్లు వైద్యపరీక్షలకే ఖర్చవుతుంది. చిన్నపాటి జ్వరం వచ్చినా మందులు, వైద్యుడి ఫీజు కలిపి రూ.500నుంచి రూ.1000 మధ్య ఖర్చయితే వైద్య పరీక్షల ఖర్చులు మాత్రం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ప్రైవేటులో డెంగీ పరీక్ష చేస్తే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది… వైరల్ ఫీవర్ పరీక్షలు చేయిస్తే రూ.1500నుంచి రూ.2వేల చొప్పున వైద్యపరీక్షల కోసం ఖర్చవుతుంది. ఈ క్రమంలో వైద్యపరీక్షల ఖర్చు రోగులకు ఆర్థిక భారంగా మారుతున్నది. దీనిని గమనించిన నాటి కేసీఆర్ సర్కర్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా చికిత్సతో పాటు వైద్యపరీక్షలను సైతం మెరుగుపర్చాలనే లక్ష్యంతో 2018లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా హాస్పిటల్స్ నుంచి శాంపిల్స్ను సేకరించి నారాయణగూడ ఐపీఎంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు అవసరమైన వైద్యపరీక్షలకు సంబంధించిన రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించి వాటిని క్లస్టర్ల వారీగా నారాయణగూడలోని సెంట్రల్ ల్యాబ్ అంటే నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు తరలిస్తారు. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో 480 సెంటర్ల నుంచి ప్రతి రోజూ సుమారు 10వేల నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్లు అంచనా. ఈ నమూనాలను పరీక్షించి, వ్యాధులను నిర్థారించిన అనంతరం వాటికి సంబంధించిన నివేదికలను నేరుగా రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపడం జరుగుతుంది. ఇది నాటి మాట. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య ఆరోగ్యశాఖ పాలకుల నిర్లక్ష్యం జబ్బుతో మూలుగుతోంది. పర్యవేక్షణా లోపంతో ప్రజారోగ్యం పడకేసిందని జనం మండిపడుతున్నారు. దవాఖానలో మందులు సరిగ్గా ఉండవు. రీయేజెంట్స్ కొరత కారణంగా వైద్య పరీక్షలు కావు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ వెబ్సైట్ సరైన నిర్వహణ లేక తరచూ సర్వర్డౌన్కు గురవడంతో రోగులు మళ్లీ ప్రైవేటు బాట పడుతున్నారు.