సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : అవినీతి, సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్గా కీసర పోలీస్స్టేషన్ మారిపోయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీ చూడనట్లు వ్యవహరించడంతో అక్కడున్న సీఐ, స్టేషన్లోని ఎస్సైలు మరింత చెలరేగిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ల్యాండ్ సెటిల్మెంట్లు, అక్రమ కేసులు బనాయించడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లక్షలు వసూలు చేయడంతో అక్కడున్న సీఐ, మరికొందరు ఎస్సైలది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ఫేక్ డాక్యుమెంట్లు ఉపయోగించి ఖాళీ ప్లాట్లను కొట్టేసే ముఠాలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. ఠాణాకు వచ్చేవారిపై బూతు పురాణం ప్రయోగించడం.. కీసర పోలీస్ స్టేషన్లోని అధికారుల తీరిది. కాగా, కీసర పోలీస్స్టేషన్లో యథేచ్ఛగా కొనసాగుతున్న అవినీతికి ఏసీబీ తాత్కాలికంగా చెక్ పెట్టింది. ఓ బాధితుడు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ ఎస్సైని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, లంచం డిమాండ్ చేసిన స్టేషన్ సీఐని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కీసర ప్రాంతంలోని ప్రజలు ఆ ఠాణా ముందుకొచ్చి.. బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సంబురాలు చేసుకోవడం గమనార్హం.
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లకు నకిలీ పత్రాలు తయారు చేసి, ఆ నకిలీ పత్రాలతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మేనేజ్ చేసుకొని కొందరు ఖాళీ ప్లాట్లను కాజేశారు. అసలైన యజమానులు ఈ విషయం తెలుసుకొని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో 20కిపైగా వేరు వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వేర్వేరు ముఠాలు అరెస్ట్ కావడంతో పాటు డాక్యుమెంట్ రైటర్, ఒక సబ్ రిజిస్టార్ సైతం అరెస్టయ్యాడు. నకిలీ ముఠాలను అరెస్ట్ చేసిన సమయంలో ఆర్భాటంగా తాము ముఠాను అరెస్ట్ చేశామంటూ.. ప్రకటనలు ఇచ్చారు.. ఆ తరువాత ఆ ముఠాల్లో ఉన్న వారిని ఆ ఒక్క కేసుకే పరిమితం చేస్తూ అక్కడితోనే ఆయా కేసులను మామ అన్పించారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో కలిసిపోయిన ఆ ఇన్స్పెక్టర్, స్టేషన్లోని కొందరు ఎస్సైలు ఏకంగా సెటిల్మెంట్ల కోసం అడ్డాలను ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఠాణాలో సెటిల్మెంట్ల ద్వారా వచ్చే వాటాలు వివిధ రూపాలలో వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కీసర పోలీస్స్టేషన్లో సెటిల్మెంట్ల కోసం జవహర్నగర్ ఠాణాను కూడా ఉపయోగించుకున్నారంటూ స్థానికులు ఆరోపిస్తుండడం అశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇక్కడి కేసులకు సంబంధించి కొందరిని జవహర్నగర్ ఠాణాకు తరలించి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ.. ఒత్తిళ్లు చేశారంటూ కీసర పోలీస్స్టేషన్ వద్ద పలువురు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇంత బహిరంగంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, అమాయకులపై కేసుల నమోదు జరుగుతున్నా ఉన్నతాధికారులకు తెలియకుండా ఉంటుం దా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నా యి. కీసర పోలీస్స్టేషన్లో జరిగే ప్రతి సెటిల్మెంట్లో కొంతమంది పై అధికారులకు కూడా వెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఏ స్థాయి వరకు వెళ్తున్నాయనేది విచారణ చేస్తేనే బయటపడుతుందంటూ సాధారణ ప్రజలు చెబుతున్నారు.
కీసర పోలీస్స్టేషన్కు చెందిన ఓ హోంగార్డు నాలుగు నెలల కిందట ఏసీబీకి ట్రాప్ అయ్యాడు. రెండు నెలల కిందట అవినీతి ఆరోపణలపై ఒక ఎస్సై సస్పెండ్ అయ్యాడు. అయినా అక్కడ అవినీతి దందా ఆగలేదు. అధి కార పార్టీ నాయకుల అండదండలు, పోలీస్ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల అశీస్సులు కూడా ఉండడంతో అవినీతిలో చెలరేగిపోయారు. తాజాగా స్టేషన్ సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో స్థానికులు సంబురాలు చేసుకున్నారు.