Buddhavanam | నందికొండ : నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం థీమ్ పార్కులో పాతరాతి యుగం ఆనవాళ్లు కనిపించినట్లు పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువు అరుణోతో కలిసి బుద్ధవనంలో కృష్ణానది తీరం వెంట సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం సోమవారం సర్వే చేస్తుండగా.. పాత పాతరాతియుగపు బింగిరాయిని గుర్తించినట్లు చెప్పారు. రాయి నదీ ప్రవాహం కారణంగా నునుపుగా మారినట్లు పేర్కొన్నారు.
ఈ రాయిని ఆదిమ మానవులు పనిముట్టుగా వాడినట్లు తెలిపారు. క్రీస్తు పూర్వం 2.6 నుంచి 1.6 మిలియన్ సంవత్సరాల్లో ఇలాంటి పనిముట్లను ఆదిమానవులు వాడారని, ఆ దశను అచూలియన్గా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటారని పేర్కొన్నారు. గతంలో బుద్ధవనంలోనే కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించామని, ప్రస్తుతం పాతరాతి యుగం పనిముట్లు కూడా లభించడంతో చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ఆయన వెంట బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, సహాయ శిల్పి శ్యాంసుందర్ ఉన్నారు.