PRLIS | కాళేశ్వరం ఓ బాహుబలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా శిఖరాయమాన కీర్తితో నిలిచింది. భారీ మోటర్లు, పాతాళమంత సర్జ్పూల్తో సాగునీటి ప్రాజెక్టుల్లో అది సృష్టించిన రికార్డులు ‘సాహో’ అనిపించాయి. ఇప్పుడు దాన్ని మించి పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెడుతున్నది. ప్రాజెక్టు కోసం ‘బాహుబలి కా బాప్’ లాంటి మోటర్లను వినియోగిస్తున్నారు. వాటి విరాట్ రూపాన్ని కొలిచేందుకు మాటలు చాలవు. ఒక్కొక్క మోటరు 19,444 ఏనుగుల బలానికి సమానం. దాని సామర్థ్యం 1.94 లక్షల అశ్వశక్తితో సరితూగనున్నది. సెకనుకు 3వేల ఘనపుటడుగుల నీటిని ఎత్తిపోయనున్నది. అలాంటివి మొత్తం 34 మోటర్లు. ఇదీ పాలమూరు రాస్తున్న మహాచరిత్ర!
బాహుబలి మోటర్లు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తరుచూ వినిపించిన మాట ఇది. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద 139 మెగావాట్ల సామర్థ్యంగల మోటర్లను బిగించినప్పుడు ప్రపంచమే అబ్బురపడింది. ఇప్పుడు దానికి బాప్ లాంటి మోటర్ సిద్ధమైంది. అదికూడా తెలంగాణలోనే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)లో భాగంగా 145 మెగావాట్ల సామర్థ్యంగల మోటర్లను బిగించారు. ఒకటి కాదు..రెండు కాదు ఇలాంటివి ఏకంగా 34 మోటర్లను ఈ పథకంలో వాడుతున్నారు. ఆదివారం ఒక మోటర్ డ్రై రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ భారీ మోటర్లపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి) : నీటిపారుదల ప్రాజెక్టుల్లో పీఆర్ఎల్ఐఎస్ కొత్త చరిత్ర సృష్టించనున్నది. అత్యధిక సామర్థ్యంగల మోటర్లను వినియోగిస్తున్న ప్రాజెక్టుగా ఇది రికార్డు నెలకొల్పనున్నది. కృష్ణా నది బ్యాక్ షోర్లోని జలాలను సముద్ర మట్టానికి 232.5 మీటర్ల ఎత్తు నుంచి, 629 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడమంటే మాటలు కాదు. దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి నాలుగు దశల్లో పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఏదుల పంప్హౌజ్లో ఏర్పాటు చేసిన మోటర్లు నీటిని ఏకంగా 124 మీటర్లపైకి ఎత్తిపోయనున్నాయి. 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఈ పథకంలో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు మొత్తం 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పంపులను అమర్చుతున్నారు.
ఒక్కో పంపుతో 3 వేల క్యూసెక్కులు..
ఈ ప్రాజెక్టులో బిగిస్తున్న 145 మెగావాట్ల మోటర్ గరిష్ఠంగా 85 క్యూమెక్ల నీటిని పంపింగ్ చేస్తుంది. ఒక క్యూమెక్ అంటే 35.313 క్యూసెక్కులు. ఈ లెక్కన 3,000 క్యూసెక్కులకు మించిన సామర్థ్యంతో ఒక్కో మోటర్ నీటిని పంపింగ్ చేస్తుంది. నార్లాపూర్లోని మొత్తం 8 పంపుల (మరొక పంప్ను రిజర్వ్లో ఉంచుతారు) ద్వారా 24,000 క్యూసెక్కుల నీటిని 106 మీటర్ల ఎగువకు పంపింగ్ చేస్తాయి. నార్లాపూర్లో ఉండే పంపులు కృష్ణానది బ్యాక్ షోర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తాయి. అలాగే ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్లో ఉండే మోటర్లు 2,650 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఏదుల, వట్టెంలో 9 చొప్పున ఉన్న మోటర్ల ద్వారా సుమారు 23,840 క్యూసెక్కుల ప్రవాహం రిజర్వాయర్లలోకి వస్తుంది. ఇలా 24 గంటలు మోటర్లు నడిస్తే 2 టీఎంసీలు అవుతాయి. రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తోడిపోసుకోవచ్చు.
అన్నింట్లోనూ రికార్డే..
400 కేవీ సబ్స్టేషన్
ఇంతటి భారీ మోటర్లను నడిపించాలంటే అదే స్థాయిలో విద్యుత్తు అవసరం. అందుకే ఒక్కో పంపు హౌజ్ దగ్గర 400/11 కేవీ సామర్థ్యంగల సబ్స్టేషన్ను నిర్మించారు. సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకే రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. వీటిని నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ పంప్హౌజ్ల వద్ద ఏర్పాటు చేశారు. 400 కేవీ సబ్స్టేషన్ నుంచి భారీ కేబుళ్ల ద్వారా విద్యుత్తును మోటర్లకు అనుసంధానిస్తారు. 34 మోటర్లకు 3,665 మెగావాట్ల విద్యుత్తు అవసరం. అందుకు తగినట్టుగానే విద్యుత్తు సంస్థలు ఏర్పాట్లు చేశాయి.
కాళేశ్వరం మోటర్లకు తండ్రిలాంటివి
పాలమూరుతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు కవర్ అయ్యేలా సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సుమారు 400 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా దీనిని తీర్చిదిద్దాం. కాళేశ్వరంలో వాడిన 139 మెగావాట్ల మోటర్లే బాహుబలి మోటర్లుగా ప్రసిద్ధి.పాలమూరు-రంగారెడ్డిలో వాడుతున్న 145 మెగావాట్ల మోటర్లు అంతకంటే పెద్దవి. కాళేశ్వరం మోటర్లకు ఇవి తండ్రి లాంటివన్నమాట. నిజంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులో పనిచేయటం అదృష్టం. ఈ అదృష్టాన్ని కలిగించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఆదివారం నార్లాపూర్లోని మొదటి పంపు డ్రై రన్ విజయవంతంగా నిర్వహించాం. త్వరలోనే వెట్ రన్ కూడా నిర్వహించేందుకు పనులు సాగుతున్నాయి.
-పెంటారెడ్డి, ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వ సలహాదారు
1,94,445 హార్స్ పవర్
సాధారణంగా మన ఇండ్లల్లో ఒక హెచ్పీ (హార్స్ పవర్) మోటర్ను వాడుతుంటాం. వ్యవసాయ బోర్లు, బావులకైతే 5 హెచ్పీ మోటర్లను వినియోగిస్తారు. కానీ ఈ పథకంలో ఉపయోగిస్తున్న ఒక్కో మోటర్ సామర్థ్యం అక్షరాలా 1,94,445 హార్స్పవర్. ఒక మెగావాట్ 1,341 హెచ్పీకి సమానం. ఈ లెక్కన 145 మెగావాట్లు 1,94,445 హెచ్పీ అవుతుంది. అంటే ఈ ఒక్క మోటర్ వ్యవసాయ బావులకు వాడే 38,889 మోటర్లకు సమానం అన్నమాట. 5 హెచ్పీ మోటర్ నుంచి 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాల వ్యాసార్థంలో నీరు బయటకు వస్తే, 145 మెగావాట్ల మోటర్ నుంచి వచ్చే నీరు ఏకంగా 5 మీటర్ల వ్యాసార్థంతో ఉండే పైపుల నుంచి 124 మీటర్లనిండుగా వస్తుంది. 5 మీటర్ల వ్యాసార్థం అంటే.. ఒక ట్రక్కు ఆ పైపులో నుంచి ప్రయాణించవచ్చన్నమాట. ఆ స్థాయిలో ఈ మోటర్ నీటిని పంపింగ్ చేస్తుంది. పది గుర్రాల బలం ఒక ఏనుగు శక్తికి సమానమని చెప్తుంటారు. ఈ లెక్కన కాళేశ్వరంలోని 139 మెగావాట్ల మోటర్ 18,640 ఏనుగుల శక్తికి సమానం. పాలమూరు రంగారెడ్డిలో ఉపయోగిస్తున్న 145 మెగావాట్ల మోటర్ 19,444 ఏనుగుల శక్తికి సమానం.
అతిపెద్ద మోటర్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల మోటర్లను ఉపయోగించారు. పీఆర్ఎల్ఐఎస్లో ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను వాడుగుతున్నారు. నార్లాపూర్ (8+1), ఏదుల (9+1), వట్టెం (9+1), ఉద్దండాపూర్ (5).. ఇలా నాలుగుచోట్ల ఏర్పాటుచేసిన పంప్హౌజ్లలో మొత్తం 34 మోటర్లను బిగిస్తున్నారు. ఈ 34 మోటర్లు కూడా 145 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నవే కావడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించిన 139 మెగావాట్ల సామర్థ్యంగల మోటర్లను ఆసియా ఖండంలోనే మొదటిసారి వాడారు. అందుకే వాటిని బాహుబలి మోటర్లు అన్నారు. ఇప్పుడు వాటికంటే ఎక్కువగా 145 మెగావాట్ల మోటర్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వాడుతుండటంతో వాటిని బాహుబలికా బాప్ అని చెప్తున్నారు. ప్రపంచంలో ఇంత భారీస్థాయి మోటర్లను ఎక్కడా సాగునీటిని లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించడంలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు.