హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజనకు ముందు కరువుకు మారుపేరుగా, వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు తెలంగాణ ఏర్పాటు తర్వాత తలసరి ఆదాయ వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం రూ.74,392గా ఉన్న పాలమూరు జిల్లా తలసరి ఆదాయం 2024-25లో ఏకంగా 352.86% వృద్ధిరేటుతో రూ.3,36,898 కి చేరినట్టు తెలంగాణ సోషియో-ఎకనమిక్ సర్వేలో తేలింది. గత పదేండ్ల డాటా ఆధారంగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సర్వే వివరాల ప్రకారం 4 జిల్లాలు రాష్ట్ర సగటుకన్నా అధిక తలసరి ఆదాయా న్ని నమోదు చేశాయి. ప్రస్తుత ధరల ప్రకా రం దేశ తలసరి ఆదాయం రూ.2,05,32 4 మాత్రమే. తెలంగాణలోని అన్ని జిల్లా లూ ఇంతకన్నా ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగివున్నాయి.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఏడంకెల తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలిచింది. ఈ జిల్లాలో పదేం డ్ల క్రితం రూ.3,43,731గా ఉన్న తలసరి ఆదాయం.. ఇప్పుడు 228.66% వృద్ధి చెంది రూ.11,29,735కు చేరింది. అనేక ఐటీ కంపెనీలు, గ్లోబల్ కేపాబులిటీ సెంటర్ల ఏర్పాటుతో సేవారంగానికి రంగారెడ్డి జిల్లా ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇదే సమయంలో రాష్ట్ర సగటు తలసరి ఆదాయం 169% వృద్ధి చెంది రూ.1,40,840 నుంచి రూ.3,80,031కి చేరింది. దీంతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు అధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేయగా.. జగిత్యాల రూ.2,44,245, వికారాబాద్ రూ.2,47,747 తలసరి ఆదాయంతో మిగిలిన జిల్లాల కంటే వెనుకబడ్డాయి.
అయినప్పటికీ ఈ 2 జిల్లాల తలసరి ఆదా యం దేశ సగటు కంటే ఎక్కువే. తెలంగాణలో పదేండ్లుగా భూముల వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. సాగుభూమి విస్తీర్ణం 41.75 లక్షల హెక్టార్ల నుంచి 62.51 లక్షల హెక్టార్లకు చేరింది. ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఏకంగా మూడు రెట్లు పెరిగి 21.80 లక్షల హెక్టార్ల నుంచి 56.18 లక్షల హెక్టార్లకు చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 51.45 లక్షల టన్నుల నుంచి 232.10 లక్షల టన్నులకు పెరిగింది. దీంతో 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి పెరుగుతుందని అంచనా.
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు పదేండ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వ్యవసాయ, సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి వల్ల నేడు తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం, బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలకు మెచ్చి అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, హైదరాబాద్ చుట్టూ అనేక ఐటీ సంస్థలు, ఇతర పరిశ్రమలు కొలువుదీరడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.