Palamuru | కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు ఉన్నా సాగునీరు లేక నెర్రెలు వారిన నేలలు. పొట్టకూటి కోసం ఇతర రాష్ర్టాలకు వలసలు పోయే జనం. ఆకలి తీర్చేందుకు అంబలి, గంజి కేంద్రాలే గతి అయిన దౌర్భాగ్యం. గుక్కెడు తాగునీటికి కూడా కటకటలాడిన రోజులు. సర్కారు వైద్యం, విద్య అందక పక్క రాష్ర్టాలకు వెళ్లాల్సిన దుస్థితి. కనీస మౌలిక వసతులకూ నోచుకోని జనం.. ఇదీ కాంగ్రెస్ పాలనలో పాలమూరు దుస్థితి.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోనసీమను తలపించే పచ్చటి పొలాలు. గ్రామాల్లో ధాన్యపు రాశులు. వాపస్ వస్తున్న వలసలు పోయిన జనం. విద్య, వైద్యం, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్న వైనం. కొత్త జిల్లాల ఏర్పాటుతో చేరువైన పాలన. బీడు భూముల్లో పచ్చదనం పరుచుకున్నది. తాగునీటికి గోస పడ్డ ప్రాంతం ఇవాళ మిగతా జిల్లాలకు గొంతు తడుపుతున్నది. పదేండ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు సాధించిన అద్భుత విజయాలు ఇవి.
కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు సగంలోనే వదిలేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జూరాల, శ్రీశైలం బ్యాక్ వాటర్పై నిర్మించిన ప్రాజెక్టులను పూర్తి చేసింది. కేసుల చిక్కులను చేధించి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించారు. 2,945 చెరువులను పునరుద్ధరించారు. 75 చెక్డ్యాంలను నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తి చేయడంతో 1.20 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పనులను పూర్తి చేశారు.
ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం
2014లో: 2,28,388 ఎకరాలు..
ఇప్పుడు: 11,00,000ఎకరాలు
అద్దంలా మెరిసిపోతున్న రహదారులు
కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా ఉన్న పాలమూరు రహదారులు కేసీఆర్ హయాంలో అద్దాల్లా మారాయి. మండల కేంద్రాల్లో డబుల్ రోడ్లను, అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేసింది. మహబూబ్నగర్ – జడ్చర్ల మధ్య నాలుగు లేన్ల రహదారిని విస్తరించారు. బైపాస్ రోడ్డు పూర్తయ్యింది. రూ.192 కోట్లతో మండల కేంద్రాల నుంచి మహబూబ్నగర్కు ఉన్న 129 కి.మీ.ల సింగిల్ రోడ్లను, డబుల్ రోడ్లుగా చేశారు. దేవరకద్ర ఆర్వోబీ, బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రహదారిని విస్తరించారు. నాగర్కర్నూల్ జిల్లాలో 542 కి.మీల కొత్త రహదారులు వేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రహదారిని వెడల్పు చేసి ఫోర్లేన్గా మార్చారు. వనపర్తి జిల్లాలో 64 రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
l తాగునీటి కష్టాలకు చెక్
ఉమ్మడి పాలమూరు చెంతనే కృష్ణ, తుంగభద్ర, భీమా నదులు పారుతున్నా గతంలో గుక్కెడు తాగునీళ్లకూ ఇక్కడి ప్రజలు కష్టాలు పడ్డారు. కలుషిత జలాలు, ఫ్లోరైడ్ నీళ్లు తాగి వ్యాధుల బారిన పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెడుతూ మిషన్ భగీరథ కింద ఎల్లూరు రిజర్వాయర్ను నిర్మించింది. మహబూబ్నగర్ జిల్లాలో 877 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. 1,58,134 ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 1,166 కిలోమీటర్ల నీటి పైపులను బిగించి 411 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో 237, గద్వాల జిల్లాలో 311, నాగర్కర్నూల్ జిల్లాలో 726 గ్రామాలకు సురక్షిత నీటిని అందిస్తున్నారు.
ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు
గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లేవారు. నారాయణపేట వాసులు రాయిచూర్, వనపర్తి, గద్వాల జిల్లా వాసులు కర్నూలు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వచ్చేది. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి మారింది. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల జిల్లా దవాఖానలను అప్గ్రేడ్ చేశారు. నారాయణపేటలో చిన్నపిల్లల కేర్ యూనిట్ను నెలకొల్పారు. వనపర్తి, గద్వాలలో 100 పడకల దవాఖానలను 300 పడకల దవాఖానలుగా అప్గ్రేడ్ చేశారు. మదర్ అండ్ హెల్త్ చైల్డ్ సెంటర్, నర్సింగ్ కాలేజీ, క్రిటికల్ కేర్ యూనిట్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అచ్చంపేటలో 100 పడకల దవాఖానను, మహబూబ్నగర్ పట్టణంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నది. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఐదు ఏర్పాటు చేసింది.
కొత్త విద్యాలయాలకు కేంద్ర బిందువు
ఈ పదేండ్లలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కేసీఆర్ ప్రభుత్వం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పింది. అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలలు మంజూరు చేసింది. గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించింది. డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టింది. వనపర్తిలో వ్యవసాయ, మత్స్య కళాశాల, మహబూబ్నగర్, వనపర్తిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసింది. పాలెంలో వ్యవసాయ కళాశాల, కొల్లాపూర్లో హార్టికల్చర్ కాలేజీలను నెలకొల్పింది. 35 కొత్త బీసీ, ఎస్సీ గురుకులాలు మంజూరు చేసింది.
వలసల జిల్లాకు ఐటీ సొబగులు
గతంలో ఉన్న ఊళ్లల్లో ఉపాధి లేక ఊళ్లకు ఊళ్లూ ఖాళీ చేసి వలసపోయే దశ నుంచి ఈ పదేండ్లలో ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధినిచ్చే జిల్లాగా పాలమూరు మారిపోయింది. గతంలో
వలసలు పోయిన వాళ్లు మళ్లీ తిరిగి వచ్చి సొంత ఊర్లలో వ్యవసాయం చేసుకుంటున్నారు. మహబూబ్నగర్లో రూ.40 కోట్లతో ఐటీ హబ్ ఏర్పాటు చేయడంతో సుమారు 12 వందల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఐటీ ఉద్యోగాలు లభించాయి. జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు వస్తుండటంతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దివిటిపల్లి వద్ద అమరరాజా కంపెనీ కొత్తగా దేశంలోనే తొలిసారిగా రూ.తొమ్మిది వేల కోట్లతో లిథియం ఆయాన్ గిగా ఫ్యాక్టరీని నిర్మించబోతున్నది.
…? నీంకర్ వెంకటేశ్వర్ రావు