మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారుల వలయంగా మారబోతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో చించోలి నుంచి మహబూబ్నగర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణ పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్- బెంగళూరు, బళ్లారి టూ కోదాడ జాతీయ రహదారులు ఉండగా..చించోలి- మహబూబ్ నగర్ జాతీయ రహదారి కూడా కొత్తగా ఏర్పాటు అవుతున్నదన్నారు.
మహబూబ్ నగర్ నుంచి అమ్రాబాద్ వరకు కూడా మరో జాతీయ రహదారి ఏర్పాటు కానుందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే జాతీయ రహదారుల కనెక్టివిటీ పెరగడంతోపాటు కొత్త హైవేలతో మరింత రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, జాతీయ రహదారుల ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ పాల్గొన్నారు.