ఇస్లామాబాద్, ఆగస్టు 29: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట లభించినట్టే లభించి తిరిగి తీవ్ర నిరాశను మిగిల్చింది. తోషాఖానా కేసులో కింది కోర్టు విధించిన మూడేండ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ (తాత్కాలికంగా నిలిపివేయడం) చేసింది. వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించడంతో ఇమ్రాన్, ఆయన పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అయితే వారి సంతోషం ఎంతోసేపు నిలువలేదు.
అధికార రహస్యాల చట్టం కేసులో అతడిని జైలులో ఉంచాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించడమే కాక, ఈ నెల 30న ఇమ్రాన్ను తమ ముందు హాజరుపర్చాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇమ్రాన్ వర్గం ఉసూరుమంది. కాగా, ఇదే కేసులో ఇమ్రాన్ డిప్యూటీ, దేశ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి ఇప్పటికే జైలులో ఉన్నారు. దేశ అధికార రహస్యాల చట్టాలను ఉల్లంఘించారంటూ ఇమ్రాన్ఖాన్, ఇతరులపై ఈ నెలలో ఈ కేసు దాఖలైంది.