Vanajeevi Ramaiah | ‘ఇందుగలడందులేడని సందేహము వలదు..’ అని శ్రీహరిని సర్వాంతర్యామిగా పేర్కొన్నాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ‘హరిత’లక్ష్మి కనువిందు చేస్తున్నదని చెబుతున్నాడు వనజీవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత రామయ్య. ఈ పచ్చదనమంతా ఒక్కరోజులో వచ్చింది కాదు. తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ పట్టుదల వల్లే సాధ్యమైందని ఆయన చెబుతున్నారు. హరితహారంతోనే పచ్చదనం పురుడుపోసుకున్నది. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమైందని అంటున్నారు. పచ్చటి తెలంగాణ ఆవిష్కరణ, సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తన అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
గత పాలకులు ఎప్పుడో ఏడాదికోసారో మొక్కలు నాటించేవారు. అందరూ నాటాలని చెప్పి చేతులు దులుపుకొనేవాళ్లు. నాటిన మొక్కల గురించి పట్టించుకునే వాళ్లు కాదు. సీఎం కేసీఆర్ అలా కాదు. హరితహారాన్ని నిరంతర కార్యక్రమంగా మార్చారు. పదేండ్లలోనే పచ్చని తెలంగాణను ఆవిష్కరించారు. చిన్ననాటి నుంచి నేను కన్న కలలన్నీ హరితహారంతో నెరవేరాయి. ఈ జన్మలో ఇలాంటి హరితవనాలను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో ఈ జన్మలోనే చూసే భాగ్యం దక్కింది.
ప్రజల బాగు కోసం పరితపించే నాయకుడు
మనిషి బతికేందుకు బువ్వ కావాలి. అది పండించే రైతు చల్లగుండాలి. చుట్టూ మొక్కలుండాలి. పురుగూ పుట్రా బతకాలి. అందుకోసం సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారు. మునుపటిలా గ్రామాల్లో గిరకబాయి చప్పుడు లేదు. బిందెల కొట్లాట లేదు. ముఖ్యంగా ఆడపిల్ల అంటే అందరిలోనూ అదురుపోయింది. వాళ్ల కోసం అనేక పథకాలు ఉన్నాయి మరి. ప్రజల బాగు కోసం పరితపించే గొప్ప నాయకుడు కేసీఆర్. నా దృష్టిల తెలంగాణకు ఆయన ఓ గొప్ప మెకానిక్, గొప్ప డాక్టర్.
అయ్యాల ఎక్కడ చూసినా బొగ్గునాల బోడులే..
తెలంగాణ రాకముందు ఎక్కడ చూసినా బొగ్గునాల బోడులే కనపడేవి. రోడ్ల వెంట నీడనిచ్చే చెట్టు ఒక్కటీ ఉండేది కాదు. గండి పడి ఎండిపోయిన చెరువుల్లా భూములుండేవి. మనిషి బతికేందుకు అక్కరకొచ్చే చెట్టూచేమలు పెంచాలన్న ఆలోచనే చేయలేదు గత పాలకులు. సీఎం కేసీఆర్ పుణ్యమాని సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. నాటి బీడు భూములే నేడు పచ్చని పంటలనిస్తున్నాయి.
మొదట బాగు చేసిందే చెరువులను..
స్వరాష్ట్రంలో తెలంగాణ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ముందుగా చెరువులను బాగు చేయించారు. దీంతో చెరువులకు అనుసంధానంగా ఉన్న అనేక వృత్తులు జీవం పోసుకున్నాయి. హరితహారం పట్ల ప్రజల ఆలోచనా విధానం మారింది. కొన్నిచోట్ల నెలకు మూడు, నాలుగు సార్లు మొక్కలు నాటుతూ మొక్కల పండుగ చేసుకుంటున్నారు. ఏ శుభకార్యం ఉన్నా.. మొక్కలను బహుమతిగా ఇస్తున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నాకెంతో ఇష్టం. ఊరూరా కండ్ల నిండా పల్లెప్రకృతి వనాలు కనిపిస్తున్నాయి. కోట్లాది మొక్కలు ప్రాణం పోసుకుంటున్నాయి.
‘గ్రీన్బంధు’ ఇస్తే బాగుంటుంది..
రైతుబంధు, దళిత బంధు మాదిరిగానే గ్రీన్బంధు పథకం తెస్తే బాగుంటుంది. మొక్కలు నాటి చెట్లు పెంచే వాళ్లకు ఈ పథకం ద్వారా పారితోషికం అందిస్తే వనాలు మరింతగా వృద్ధి చెందుతాయి.
-ఖమ్మం రూరల్