సిరిసిల్ల టౌన్/వేములవాడ, మార్చి 5: తాను చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గాన్ని బాధ కలిగించేలా ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు రోజులుగా సోషల్ మీడియాలో సందర్భోచితంగా మాట్లాడిన పదాలను కొందరు తమ స్వార్థం కోసం వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని, ఓ సామాజికవర్గాన్ని కించపరిచి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. మాట్లాడిన సందర్భం వేరే అయితే.. తనను రాజకీయంగా అస్థిరపర్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు సామాజికవర్గానికి బాధ కలిగిస్తే భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రాజకీయం తన జీవితం కాదని.. సామాజిక సేవ బాధ్యతగా పని చేస్తున్నానని తెలిపారు.
సిరిసిల్ల నేతన్నచౌక్లో దిష్టిబొమ్మ దహనం
‘ఎంతమంది పాపడాలు, నిరోధ్లు అమ్ముతున్నరు’ అంటూ పద్మశాలీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డిపై నేతన్నలు ఆగ్రహించారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నేతన్నచౌక్లో కేకే మహేందర్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ‘నిరోధ్ల మహేందర్రెడ్డి’ అంటూ నినదించారు.
అనంతరం గుండ్లపల్లి పూర్ణచందర్, బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మాట్లాడారు. పద్మశాలి సామాజికవర్గంపై కేకే మహేందర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నేతన్న విగ్రహం సాక్షిగా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన రోజున సిరిసిల్ల బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజుల బాలయ్య, అన్నారం శ్రీనివాస్, దార్ల సందీప్, వేముల రవి, దూస వినయ్, ప్రకాశ్, శంకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనల ఎఫెక్ట్.. సీఎం పర్యటన రద్దు
కేకే మహేందర్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. జిల్లా వ్యాప్తంగా పద్మశాలీల నిరసనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టనున్న పర్యటన రద్దయింది. ఈ నెల 7న వేములవాడ రాజన్న దర్శనంతోపాటు సిరిసిల్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా.. కాంగ్రెస్ నాయకులు నేతన్నలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలిసింది. సిరిసిల్లలో ఇప్పటికే నేతన్నలు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడంతోపాటు రేవంత్రెడ్డి పర్యటనను కూడా అడ్డుకుంటామన్న హెచ్చరికలు జారీ చేశారు.
రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర ఉన్నందున భక్తులకు ఇబ్బంది కలుగొద్దన్న ఉద్దేశంతోనే పర్యటన రద్దు చేసుకున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మహా శివరాత్రి సందర్భంగా రాజన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పిస్తారని ఆర్భాటం చేసిన నాయకులు, కార్యకర్తలు.. ఇప్పడేమో భక్తుల ఇబ్బందిని సాకుగా చూపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.