Haldi Vagu | మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 23 : అధికార పార్టీ నేతలతో అధికారులు కుమ్మక్కయ్యారని, హల్దీవాగు నుంచి నెలన్నరకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
గరీబోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక తీసుకెళ్తే మాత్రం ట్రాక్టర్లను సీజ్ చేసే అధికారులు.. రాత్రనకా, పగలనకా టిప్పర్లలో అక్రమంగా దోచుకెళ్తున్నా స్పందించకపోవడంతో మంగళవారం మెదక్ జిల్లా సంగాయిగూడ తండా శివారులో హల్దీవాగుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో కలిసి పద్మాదేవేందర్రెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ట్రైనీ కలెక్టర్ అహ్మద్, ఇతర రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందుగానే వెళ్లి ఇసుక మాఫియా వాహనాలు వాగులోకి వెళ్లేందుకు వేసుకున్న దారికి అడ్డుగా మట్టికుప్పలు వేశారు. అయితే టిప్పర్లు, ఎక్స్కవేటర్ల(హిటాచీ)ను నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండలం కొంగోడ్ గ్రామ శివారులో దాచారని గ్రామస్తులు చెప్పడంతో బీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్లింది.
అక్కడ ఒక ప్రాంతంలో మూడు ఎక్స్కవేటర్లు, వాటిని తెచ్చేందుకు వాడే పెద్ద లారీ, మరోచోట ఐదు ఇసుక లారీలు కనిపించాయి. కానీ, వాటి వద్ద ఎవరూ లేకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు.. హల్దీవాగును పరిశీలిస్తున్న తహసీల్దార్, ట్రైనీ కలెక్టర్, పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలతో ఎందుకు కుమ్మక్కయ్యారని నిలదీశారు. వందలాది వాహనాల్లో హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల నుంచి సమాధానం కరువైంది. వాగులోకి వాహనాలు వెళ్లకుండా మట్టికుప్పలు పోశారని మాత్రమే చెప్పడం తప్ప మరో సమాధానం రాలేదు. దీంతో ఎక్స్కవేటర్లు, టిప్పర్లను సీజ్ చేసేవరకు ఇక్కడే బైఠాయిస్తామని వారు హెచ్చరించారు. ఇసుక తరలించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, కొంగోడు వద్ద ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం ఇసుక అక్రమ తరలింపు, ఇసుక మాఫియాపై కలెక్టర్ రాహుల్రాజ్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. వారి వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మాచవరం సర్పంచ్ సాంబశివరావు, బీఆర్ఎస్ నాయకులు అంజాగౌడ్, కిష్టయ్య, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జయరాజ్, ఆర్కే శ్రీనివాసన్, మోహన్నాయక్, మార్గం ఆంజనేయులు, చంద్రకళ, రవి, ప్రభాకర్, వెంకటేశం, నవీన్, కిశోర్, బట్టి ఉదయ్, ఫాజిల్ తదితరులు ఉన్నారు.
దొంగేదొంగ అన్నట్టు ఇసుక దొంగలే.. ఇసుక అక్రమ రవాణాను అరికడతామంటూ నాటకాలు ఆడుతున్నారని పద్మాదేవేందర్రెడ్డి, మండిపడ్డారు. ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తే వాగులో నీరు నిల్వలేక మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ రైతులు నష్టపోయే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది, కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ఆమె మండిపడ్డారు. ప్రజలు అక్రమ రవాణాను ఆపే ప్రయత్నం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నా.. కలెక్టర్, పోలీసులు స్పందించరా? అని ప్రశ్నించారు. ఇసుక రవాణాను అరికట్టకపోతే వేలాది రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.
హల్దీవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గ్రామస్తులు, తండావాసులు అడ్డుకొని, అధికారులకు సమాచారమిచ్చినా ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమ రవాణాపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిరోజూ ఇసుక మాఫియా స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అక్రమ రవాణా సాగిస్తున్నా చర్యలు తీసుకోవడం లేని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇసుక అక్రమ రవాణాపై మూడు రోజులుగా పత్రికల్లో కథనాలు వచ్చినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మండిపడ్డారు. దీనిని బట్టి చూస్తే పోలీసు, నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగితే తప్ప అధికారులు స్పందించరా అని మండిపడ్డారు. మొన్న భారీ వర్షాలకు దూప్సింగ్తండాలో వ్యవసాయ భూమిలో ఇసుక మేట ఏర్పడితే, దాన్ని తీసుకెళ్లిన రైతును పోలీసులు పట్టుకెళ్లారని, ఇసుక అక్రమార్కులకు మాత్రం మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.
‘మేం ఇల్లు కట్టుకోవడానికి వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లో తెచ్చుకుంటమంటే అధికారులు తేనియ్యరు. తెచ్చుకుంటే సీజ్ చేస్తరు. వేలకు వేలు ఫైన్ వేస్తరు. రెండు నెలల నుంచి రాజకీయ నాయకుల అండదండలతో పెద్ద పెద్ద లారీలు, ట్రిప్పర్లలో ఇసుక తీసుకపోతున్నరు. అధికారులకు చెప్పినా పట్టించుకోరు. తండా వద్ద లారీలను ఆపితే దౌర్జన్యం చేస్తున్నరు. లారీలను ఆపినోళ్లను తొక్కేయండ్రా అని బెదిరిస్తున్నరు..’ అంటూ తండావాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏ లం..కొడుకులు లారీలను ఆపుతరో వాళ్ల అంతుచూస్తామని బెదిరించడంతో ఏమీ చేయలేక ఊరుకుంటున్నామని తండావాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. రాత్రీపగలు భయంతో బతుకుతున్నామని వాపోయారు.