MLA Kaushik Reddy | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తమ అభ్యర్థిగా దానం నాగేందరను ప్రకటించిందని, ఆయన ఆ పార్టీలో చేరాడని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి ఆధారాలు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దానంపై వెంటనే అనర్హత వేటువేయాలని మరోసారి స్పీకర్ను కోరారు.
తెలంగాణ భవన్లో శనివారం కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న సభాపతిని కలిసి దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ ఇచ్చామని, 12 రోజులైనా స్పందన లేక అదనపు అఫిడవిట్ సమర్పించేందుకు సభాపతిని కలిసేందుకు వెళ్తే ఎవరూ లేరని చెప్పా రు. సభాపతి నిర్ణయం తీసుకొని దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే దేశం మొత్తం హర్షిస్తుందని అన్నారు. సభాపతి వెంటనే స్పందించాలని, చర్య తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. సభాపతి చర్య తీసుకోకపోతే న్యాయస్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి పార్టీ మారడమంటే నమ్మించి గొంతు కోయడమే అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపా ల్, బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.