హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం చేసిన కుట్ర తేటతెల్లమైంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానే ఈ కుట్రను బయటపెట్టారు. శనివారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతీ కిలో బాయిల్డ్ రైస్ కొంటాం’ అని హామీ ఇచ్చారు.
అంటే.. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయడం లేదని స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే బాయిల్డ్ రైస్పై కేంద్రం, తెలంగాణ బీజేపీ కలిసి ఆరు నెలలుగా నాటకాలు ఆడుతున్నాయని తేలిపోయింది. ఇప్పడు కొననివారు అధికారంలోకి వస్తే ఎలా కొంటారో చెప్పాలని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా ప్రకటనతో ఇన్నాళ్లు రైతుల జీవితాలతో ఆటలాడామని బీజేపీ ఒప్పుకొన్నట్టేనని మండిపడుతున్నారు.