పునరుద్ధరణకు రూ.426 కోట్లు అవసరమని అధికారుల అంచనా
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదలు పంచాయతీరాజ్ రోడ్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ రోడ్లకు జరిగిన నష్టం రూ.426 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 535 చోట్ల 735 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని గుర్తించారు. వీటికి తాత్కాలికంగా, శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి రూ.210 కోట్లు, గండ్లను పూడ్చడానికి రూ.35.11 కోట్లు, 592 డ్రైనేజీ, కమ్యూనిటీ వర్క్లకు, డ్రైనేజీలకు రూ.174.53 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంజినీరింగ్ అధికారులు నివేదిక రూపొందించారు. కాగా, వర్షాలు, వరదలు తగ్గిన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై రాష్ట్ర, జిల్లా పంచాయత్ శాఖ అధికారులతో డైరెక్టర్ హనుమంతరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకల్లా గ్రామ పంచాయతీలో ఉండాలని, వారి హాజరును ఎంపీవోలు, డీపీవోలు తనిఖీ చేయాలని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉదయాన్నే అందుబాటులో లేకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వరద సహాయక చర్యలు
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన మున్సిపాలిటీల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మణుగూరు, భైంసా, మంచిర్యాల, ఆదిలాబాద్, మంథని, నిర్మల్, రామగుండం పట్టణాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 31 ప్రాంతాల్లో 7,359 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పరిస్థితులు మెరుగుపడ్డాక వీరిలో 6,697 మందిని వారి ఇండ్లకు పంపించారు. వరద పరిస్థితులను ఎదుర్కొవడానికి 2,122 మందితో 328 బృందాలను ఏర్పాటు చేశారు. 68,909 అహార పొట్లాలను అందించారు. 1,118 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. 237 చెట్లు కూలిపోయాయి. 14 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 77 విద్యుత్తు స్థంబాలు దెబ్బతిన్నాయి. 319 కిలోమీటర్ల మేర రోడ్లు, 60 కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాలువలు దెబ్బతిన్నాయి. 138 కల్వర్టులు దెబ్బతినగా, 22 కిలోమీటర్ల వరకు తాగునీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.