హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్లో నిధుల పెంపు ప్రతిపాదనలకు కేంద్రం మోకాలడ్డుతున్నది. ప్రతిపాదనల దశలోనే సీలింగ్ విధించింది. దీంతో నిధులు రాబట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇందుకు కేంద్రం ముందస్తుగానే పలు కొర్రీలు పెట్టింది. ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం బుధవారం జరగనున్నది. 2022-23 విద్యా సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వర్చువల్గా నిర్వహించే ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ సమావేశం కోసం ఎస్ఎస్ఏ ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించింది. గతంలో ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత కేంద్ర విద్యాశాఖ అధికారులు కోతలు విధించేవారు. టీచర్లు ఎక్కువ ఉన్నారు, రేషనలైజేషన్ చేయండి అంటూ ఆదేశాలిచ్చేవారు. కానీ, ఇప్పు డు గతానికి భిన్నంగా ప్రతిపాదనల సమయంలోనే కేంద్రం కత్తిరింపులు పెట్టింది. పాత బడ్జెట్లో 20శాతం వరకు పెంచుకొనే అవకాశాన్నివ్వగా, మొత్తంగా రూ.1,700 కోట్ల వరకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఏర్పడింది. అదనంగా పెంచుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. దీంతో పీఏబీ సమావేశానికి ముందే కేంద్రం కోతల వైఖరి స్పష్టమయ్యింది. మొత్తంగా ఆశించింది కొండంత అయితే.. వచ్చేది రవ్వంత అని సమావేశానికి ముందే తేలిపోయింది.