హైదరాబాద్/కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అంతన్నాడింతన్నాడే.. గంగరాజు’ అంటూ సాగే ఓ సినిమా పాట.. ఇప్పుడు ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికలు రాగానే బీరాలు పలకడం.. ఫలితాలు వచ్చేసరికి ఎల్లెలకల పడటం రివాజుగా మారింది. తాజాగా వెల్లడైన శాసనమండలి ఎన్నికల్లోనూ విపక్షాలది అదే పరిస్థితి. కనీసం వాళ్ల పార్టీ ప్రజాప్రతినిధుల ఓట్లను కూడా వేయించుకోలేకపోయారు. గతంలో నిజామాబాద్, హుజూరాబాద్ ఎన్నికల్లో లోపాయికారీగా కుమ్మక్కైన రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మరోసారి తెర వెనుక చేతులు కలిపాయి. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులుగా చెప్పుకొనే నేతలున్న నల్లగొండ జిల్లాలో కనీస స్థాయిలో కూడా ఓట్లు రాలేదు. సొంత ఓట్లను కూడా సరిగ్గా పోల్ చేయించుకోలేని దుస్థితిలోకి కాంగ్రెస్ వెళ్లిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్కు 830 ఓట్లు ఉండగా 917 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 384 ఓట్లు ఉండగా 226 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవాళో రేపో గద్దెనెక్కేస్తామని కనపడ్డ ప్రతి మైకు ముందు బాకాలూదిన బీజేపీకి కరీంనగర్లో రెండు స్థానాలకు అభ్యర్థులే దొరకక ముందే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడే చెప్పుకోవాల్సి వచ్చింది. విచిత్రమేమంటే.. బీజేపీ అధ్యక్షుడు అభ్యర్థి లేడని ప్రకటిస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వతంత్ర అభ్యర్థి రవీందర్సింగ్కు ఓటేయాలని ప్రచారం చేసి భంగపడ్డారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చెప్పనే అక్కరలేదు.
సొంత ఓట్లూ వేయించుకోలేని దైన్యం
12 స్థానిక సంస్థల కోటా శాసనమండలి సభ్యులకు ఎన్నికలు జరిగితే ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ, కాంగ్రెస్ గెలుచుకోలేకపోయాయి. కనీసం తమ పార్టీ ఓట్లను సైతం తమ అభ్యర్థులకు వేయించుకోలేకపోయారు. చివరికి టీఆర్ఎస్ను ఓడించడానికి రెండు పార్టీలు ఒక్కటైనప్పటికీ ఒక్క సీటు కూడా దక్కలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేత ఈటల బలపరచిన స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ నేతలు తమ ప్రజాప్రతినిధుల ఓట్లు వేయించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఫలితాల సరళిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన రవీందర్సింగ్కు ఏకంగా 232 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఉన్న ఓట్లే వంద. మరి మిగతా ఓట్లు ఎక్కడినుంచి పడ్డాయో ఊహించడం కష్టం కాదు. టీఆర్ఎస్పై రెబెల్గా పోటీలో ఉన్న రవీందర్సింగ్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాదరావుకు 585, ఎల్ రమణకు 479 ఓట్లు రాగా, రవీందర్సింగ్ 232 ఓట్లు వచ్చాయి.
ఈటలకు గట్టి షాక్
పార్టీ గుర్తుపై కార్పొరేటర్గా గెలిచిన విశ్వాసం లేకుండా పోటీ చేసిన రవీందర్సింగ్కు.. తాను ఏదిచెప్పినా నడుస్తుందన్న భావనతో ఉన్న ఈటలకు ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1324 మంది ఓటర్లు ఉండగా.. అందులో 986 మందికి పైగా టీఆర్ఎస్ గుర్తుపై గెలిచినవారే. వివిధ పార్టీల నుంచి గెలిచిన కొంతమంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు సైతం టీఆర్ఎస్లో చేరడంతో టీఆర్ఎస్ బలం వెయ్యికి పైగా చేరింది. ఉన్న మెజార్టీ ప్రకారం నూటికి నూరు పాళ్లు విజయం టీఆర్ఎస్ వైపు ఉన్నది. ఎన్నికల్లో ఏకగ్రీవం ఖాయమనుకొన్న సమయంలో కొందరు తెరవెనుక కుట్రచేశారు. ఈ క్రమంలోనే గతంలో కారు గుర్తుపై కార్పొరేటర్గా గెలిచిన రవీందర్సింగ్ రెబెల్గా బరిలో నిలిచారన్న విమర్శలు వచ్చాయి. రవీందర్సింగ్కు ముందునుంచీ ఈటల అండదండలున్నాయి. రవీందర్సింగ్ను గెలిపించాలని ఈటల వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడమే ఇందుకు తార్కాణం.
బీజేపీలో కలకలం
జాతీయ పార్టీలో ఉంటూ.. ఆ పార్టీ నిబంధనలను తుంగలో తొక్కి.. ఓ స్వతంత్ర వ్యక్తికి ఓటు వేయాలంటూ ఈటల చేసిన ప్రచారం.. బీజేపీలో కలకలం రేపుతున్నది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు సంజయ్ తమ పార్టీ అభ్యర్థులెవరూ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేరని చెప్పినా.. రవీందర్సింగ్కు ఓటేయాలని ఈటల పిలుపునివ్వడం ఇద్దరు నేతల మధ్య అంతరాల్ని బయటపెట్టింది. నిజానికి ఓ జాతీయ పార్టీ.. అందులోనూ ఒక ఎమ్మెల్యే ఆ పార్టీతో సంబంధంలేని వ్యక్తులకు మద్దతు తెలుపాలంటే.. ముందుగా పార్టీలో చర్చించాలి. అధిష్ఠానం నిర్ణయం మేరకు మద్దతు ప్రకటించాలి. కానీ ఈటల నిర్ణయంపై బీజేపీలో అసంతృప్తి రేగింది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని రవీందర్సింగ్కు ఓటు వేయాలని ఎలా చెప్తారన్న ప్రశ్నలను పార్టీనాయకులే సంధిస్తుండగా.. ఇప్పుడు టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.. బీజేపీకి పెద్ద మచ్చపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.