హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ఫార్మాసిటీపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల కోసం ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రియల్ పార్క్ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసి దేశంలో ఎక్కడా లేనివిధంగా పరిశ్రమలకు రాయితీలను ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. యూపీ ప్రభుత్వం ఇటీవల లక్నోలో పెట్టుబడుల సదస్సు నిర్వహించడంతో రిలయెన్స్, అదానీ గ్రూపులు సహా పలు కంపెనీలు ఆ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే యూపీకి చెందిన ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ నెల 18న తెలంగాణలోని ఫార్మా, లైఫ్సైన్సెస్ కంపెనీలతో హైదరాబాద్లో సమావేశమైంది. మన రాష్ర్టానికి చెందిన రెడ్డీస్ ల్యాబ్స్, సువెన్ లైఫ్సైన్సెస్, లారస్ ల్యాబ్స్, భారత్ బయోటెక్, అరేనే లైఫ్సైన్సెస్, సాంగ్ఫ్రైడ్ ఇండస్ట్రీస్ తదితర 70కిపైగా కంపెనీల ప్రతినిధులతోపాటు బల్క్డ్రగ్ తయారీదారుల సంఘం, ఇండియన్ డ్రగ్ మ్యానిఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని యూపీ బృందంతో సంప్రదింపులు జరపడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో రెడ్ ఇండస్ట్రీలకు ఆదరణ కరువు
సాధారణంగా పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ క్యాటగిరీలుగా విభజిస్తారు. వీటిలో హానికారక రసాయనాలు, బల్క్డ్రగ్ పరిశ్రమలతోపాటు మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి హాని కలిగించే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను రెడ్ క్యాటగిరీలో ఉంచుతారు. దాదాపు ఫార్మా కంపెనీలన్నీ రెడ్ క్యాటగిరీలోకే వస్తాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ (శుద్ధి) చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం అయినందున కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)ను ఏర్పాటు చేస్తే కంపెనీలపై చాలావరకు భారం తగ్గుతుంది. కానీ, మన రాష్ట్రంలో ఇప్పటివరకు రెడ్ ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేయలేదు.
సీఈటీపీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలు సొంత ఖర్చుతో తక్కువ సామర్థ్యం కలిగిన సీఈటీపీలను ఏర్పాటు చేసుకోగా.. కొన్ని చిన్న పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను అక్రమంగా నాలాల్లోకి, చెరువుల్లోకి వదులుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి తరచూ వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో గత కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 16 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందులో ఇప్పటికే 13 వేల ఎకరాలు సేకరించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో పరిశ్రమల ఏర్పాటుకు పలు పెద్ద కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఫార్మాసిటీలో మౌలిక సదుపాయాలను కల్పించి, సీఈటీపీని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడంతో పరిశ్రమ వర్గాల్లో సందిగ్ధత నెలకొన్నది.
‘ఫార్మా’పై రేవంత్ సర్కారు శీతకన్ను
మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేసి ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామంటూ అడ్డగోలు వాదనాలు తెరపైకి తేవడంతో పరిశ్రమ వర్గాలు సందిగ్ధంలో పడ్డాయి. ఒకవేళ తెలంగాణలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసి నా స్థానిక ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు ఎటువంటి సహకారం అందుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ కంటే యూపీ అన్ని విధాలుగా ఉత్తమ ఎంపిక అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కష్టపడి తెచ్చిన పెట్టుబడులు, అభివృద్ధి చేసిన ఫార్మాసిటీ లాంటి ఇండస్ట్రియల్ పార్కుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బహుళజాతి కంపెనీలతో ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ)లపైనే తమ ప్ర భుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సైతం ఎంఎస్ఎంఈలకు త్వరలో కొత్త పాలసీని తెస్తామని చెప్తున్నారే తప్ప ఫార్మాసిటీ, ఎంఎన్సీల అం శాన్ని ప్రస్తావించడం లేదు. ఇవన్నీ తెలంగాణలో ఫార్మా రంగానికి పెద్ద సమస్యగా మారాయి. ఓ వైపు మన రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉండడం, మరోవైపు ఇతర రాష్ట్రం నుంచి అన్ని అనుకూలతలతో ఆహ్వానాలు అందడం పరిశ్రమ వర్గాలను ఆలోచింపజేస్తున్నది. అందుకే మన రాష్ర్టానికి చెందిన 70 మందికిపైగా పారిశ్రామికవేత్తలు యూపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
భారీ తాయిలాలతో ముందుకొచ్చిన యూపీ
మన దేశంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాలకు హైదరాబాద్ రాజధానిగా ఎదిగింది. ఇక్కడ అనేక రకాల ఔషధాలు, టీకాలను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించింది. ఇక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు అందించని సౌకర్యాలు, ప్రోత్సాహాకాలను తాము అందిస్తామని, అంతేకాకుండా తెలంగాణ కంటే యూపీలో భూముల ధరలు ఎంతో చౌకగా ఉన్నాయని, యూపీలో ఎంత భూమి తీసుకున్నా 15 శాతం రాయితీతో అందిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధివర్గం పారిశ్రామిక వర్గాలకు భరోసా ఇచ్చింది. మరోవైపు, యూపీకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పథకాలు అందిస్తుండడం ఆ రాష్ర్టానికి మరో సానుకూల అంశంగా మారింది.