హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్కు వ్యతిరేకంగా నగరంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన జూలై, ఆగస్టులో ఇప్పటివరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2,056 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనదారులపై న్యాయస్థానాలు రూ.1.70 కోట్లు జరిమానాగా విధించాయి. అదేవిధంగా ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు అయింది.
హైదరాబాద్ అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ.. జులై 1వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టినట్లు తెలిపారు. పట్టుబడ్డవారిపై మొత్తం 1,670 చార్జీషీట్స్ నమోదు చేసి న్యాయస్థానాల ముందు హాజరుపరిచినట్లు చెప్పారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అదేవిధంగా పాస్పోర్టు, వీసా క్లియరెన్స్లో ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురైతే ఇన్సూరెన్స్ సైతం వర్తించదన్న విషయాన్ని పౌరులు తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్లో గాయాలపాలైనా, మరణించినా ఇన్సూరెన్స్ రాదని ఆయన పేర్కొన్నారు.