హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఐటీ రంగానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, 100కు పైగా లింకురోడ్లు ఐటీ కారిడార్ పరిధిలో నిర్మించారు. దేశంలో మరే నగరానికి లేనన్ని అనుకూలతలు హైదరాబాద్కు ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి.
ఐటీ కారిడార్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఔటర్ రింగు రోడ్డు అందుబాటులో ఉండటంతో దీని చుట్టూ వేల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మాదాపూర్, రాయిదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట, పుప్పాల్గూడ ప్రాంతాల్లోనే 1,500లకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఉన్న 24 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఐటీ కారిడార్లో ఉన్న ఔటర్ చుట్టూ కొత్తగా ఇంటర్చేంజ్ల నిర్మాణం, సర్వీసురోడ్ల విస్తరణ, సైకిల్ట్రాక్, సోలార్ రూఫ్టాప్ వంటి ప్రాజెక్టులను చేపట్టింది.