సూర్యాపేట : ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది అని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. 2014 ముందు ఆకలి చావులు, ఆత్మహత్యలు, రాస్తారోకోలు తప్ప అభివృద్ధి లేదు. 2014తర్వాత దేశంలో మరే ముఖ్యమంత్రికి రాని ఆలోచనలతో ఎన్నో కొత్త కొత్త అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది.
బతుకమ్మ పండుగకు మహిళలు కొత్త చీరెలు కట్టుకోవాలనే ఉద్దేశంతో పాటు చేనేత కార్మికులను ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాన సాంస్కృతిక వారసత్వ పండుగ బతుకమ్మ అని, అందుకే మహిళలకు చీరెల పంపిణీ అన్నారు. 18 సవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డు కలిగిన జిల్లాలోని దాదాపు 3.92 లక్షల ప్రతి ఒక్కరికి అలాగే రాష్ట్రంలో 330 కోట్లతో 1.08 కోట్ల మందికి ఉచితంగా చీరెలు పంపిణీ జరుగుతుందన్నారు.
ఈ సందర్బంగా ఆడపడుచులకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.